కందుకూరు పిఎస్లో బాధితురాలి ఫిర్యాదు
తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
మన తెలంగాణ/ మారేడుపల్లి : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కందుకూరు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా… తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, కందుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుంతోంది. సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ (40) ఫోన్లో తరుచూ మాట్లాడుతూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. తనకు సంతానం లేదని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇల్లు అద్దెకు తీసుకొని ఆమెను గత నెల 24న ఇంటికి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె పెళ్లి విషయం ప్రస్తావించగా.. కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు కందుకూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 2న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తుకారాంగేట్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.