మాంసం షాపులపై నిరంతర తనిఖీలు.. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
జిహెచ్ఎంసి పరిధిలో మటన్, స్లాటర్లపై సమగ్ర సమాచారం
ప్రతిపక్షాల ఆరోపణలు బాధ్యతరాహిత్యం : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్: మటన్లో బీఫ్ కలుపుతున్నారన్న ప్రచారం తప్పు అని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాంసం షాపులపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, నిబంధనలు పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, అధికారి డాక్టర్ బాబుబేరి పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో మాంసం షాప్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఇటీవల షాపులపై అధికారులు నిర్వహించిన తనిఖీలు సత్ఫలితాలిస్తున్నాయని మంత్రి అన్నారు.
తనిఖీల కోసం నియమించబడిన డాక్డర్ బాబుబేరి ఆధ్వర్యంలోని అధికారుల బృందం పలు సూచనలతో నివేదికను మంత్రికి సమర్పించింది. మంత్రి మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా అనేక షాపులు కొనసాగుతున్నాయని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 73 షాపులు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న మాంసం దుఖాణాలు ఎన్ని, లైసెన్స్ లేని మాంసం షాపులు ఎన్ని ఉన్నాయో సమగ్ర సమాచారం సేకరించాలని, అక్రమంగా స్లాటర్ హౌస్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. మద్య దళారుల ప్రమేయం కూడా మాంసం ధరలు పెరగటానికి కొంత కారణమన్నారు.
ఉనికి కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు
లాక్ డౌన్ ప్రారంభమైన నెలరోజుల తరువాత రాజకీయ ఉనికికోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రశంసించినట్లు చెప్పారు. ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఫోన్ లో మాట్లాడి రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారని అన్నారు. కేంద్ర మంత్రులు, అధికారులు తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందిస్తుంటే స్థానిక బిజెపి నేతలు బాద్యత లేకుండా మాట్లాడుతుండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కరోనా టెస్ట్ లు తక్కువ చేస్తున్నారన్న వాదన అవాస్తవమని, ప్రభుత్వం నిబద్దత తో పనిచేస్తుందని అన్నారు.