ఆ బీర్లకు సుంకం చెల్లించలేం.. అవన్నీ మురిగిపోయాయి
రూ.15 కోట్లను మాఫీ చేయండి
ప్రభుత్వానికి బీర్ల తయారీ దారుల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ కాలానికి బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్స్ ఫీజు మినహాయింపు అంశం తేలకముందే మరో సమస్య ఎదురయ్యింది. కరోనా సమయంలో తాము తయారు చేసిన బీర్లకు ఎక్స్ఫైరీ తేదీ అయిపోయిందని, ఆ బీర్లకు సుంకం కట్టలేమని బ్రేవరజేస్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు సుంకాన్ని మినహాయించాలని ప్రభుత్వానికి సూచించాయి. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ అమలయిన నేపథ్యంలో రెండున్నర నెలలు వైన్షాపులు, ఆరు నెలలకు పైగా బార్లను మూసివేశారు. ఈ కాలంలో వైన్షాపులు, బార్లలో ఉన్న బీర్లు అలాగే ఉండిపోయాయి. బీర్ల కాలపరిమితి ఆరునెలలే కావడంతో వైన్షాపులు తెరిచిన తరువాత బార్లలో ఉన్న బీర్లను వైన్షాపులకు తరలించారు. మద్యం డిపోల్లో తయారైన లక్షల బీర్లు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బీర్లన్నీ మురిగిపోవడంతో వాటికి ఎక్సైజ్ సుంకం చెల్లించలేమని బీర్ల తయారీదారులు పేర్కొంటున్నారు. సుంకం విలువ సుమారుగా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
Beverages seeks TS Govt on Expiry date Liquor Tax