Sunday, April 28, 2024

చరణ్ సింగ్‌కు భారత రత్న

- Advertisement -
- Advertisement -

కర్షకులకు ‘అన్యాయం’
కేంద్రాన్ని ఎండగట్టిన జైరామ్ రమేష్
రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర నేపథ్యంలో వ్యాఖ్యలు

అంబికాపూర్ : రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విశేష కృషి సల్పిన చౌదరి చరణ్ సింగ్‌కు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కేంద్రం భారత రత్న పురస్కారం ప్రకటించిందని, కానీ కర్షకులకు ‘అన్యాయం’ చేస్తున్నదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మంగళవారం ఆక్షేపించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై చట్టం చేయాలని కోరుతూ వేలాది మంది రైతులు ‘ఢిల్లీ చలో’ పాదయాత్రకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జైరామ్ రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని నగరంలోకి రైతుల రాకను అడ్డుకుంటూ అధికారులు నగరాన్ని దాదాపు దుర్భేద్యమైన కోటగా మార్చిన విషయం విదితమే.

కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సుర్గుజా జిల్లా కేంద్రం అంబికాపూర్‌లో విలేకరుల గోష్ఠిలో ప్రసంగించిన జైరామ్ రమేష్ బీహార్ ముఖ్యమంత్రి, జెడి (యు) చీఫ్ నితీశ్ కుమార్‌పై కూడా విమర్శల వర్షం కురిపించారు. బిజెపితో చేతులు కలిపినందుకు నితీశ్‌ను రమేష్ విమర్శిస్తూ, ఆయనను ‘పల్టీ కుమార్’గా అభివర్ణించారు. ‘కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలని ప్రభుత్వం గొప్ప రైతు నాయకుడు చరణ్ సింగ్‌కు, ‘హరిత విప్లవ పితామహుడు’ స్వామినాథన్‌లకు మరణానంతరం (దేశ అత్యున్నత పౌర పురస్కారం) భారత రత్నను ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతించాం’ అని రమేష్ తెలిపారు. ‘అయితే, ఇద్దరు మహోన్నతులకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటించిన ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నది’ అని రమేష్ ఆక్షేపించారు. మూడు ‘నల్ల’ సాగు చట్టాలను ఉపసంహరించినప్పుడు మోడీ ప్రభుత్వం నెరవేరుస్తామని వాగ్దానం చేసిన మూడు నాలుగు డిమాండ్లకు మద్దతుగా రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని రమేష్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News