Sunday, April 28, 2024

బిజెపి అంటే బాబు, జగన్, పవన్!

- Advertisement -
- Advertisement -

ఏపిలో వీరే మోడీ బలం, బలగం
ప్రపంచ నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉంది
రాహుల్‌ను ప్రధాని చేయటమే వైఎస్ ఆశయం
షర్మిలకు అండగా ఉంటా.. ఏపికి సిఎంను చేస్తా
విశాఖ సభలో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  బిజెపి అంటే బాబు ..జగన్ ..పవన్,  వీరే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి బలం, బలగం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం విశాఖలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఏపిసిసి నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుందన్నారు.

షర్మిలమ్మకి అండగా తానుంటానని , ఏ అవసరం వచ్చినా ముందుటానని ప్రకటించారు. షర్మిలమ్మ ఇక్కడకు అధికారం కోసం రాలేదని , ఆంధ్ర ప్రజల పక్షాన పోరాటం కోసం వచ్చిందన్నారు. ఈ సభను చూస్తుంటే తాను విశాఖలో ఉన్నట్లు లేదని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినట్లు ఉందన్నారు. ఇక్కడకు వద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏపిలో లేదు అని అన్నారు.అక్కడకు పోతే కాంగ్రెస్ పరువు పోతుంది ఏమో అని అన్నారని , అయితే వైఎస్సార్ బిడ్డ షర్మిల సభ పెడితే ఎలా ఉంటుందో తాను వారికి చెప్పానన్నారు.ఇక్కడ సభ చూస్తే షర్మిల న్యాయకత్వం ఎలా ఉందో అర్థం అవుతోందన్నారు. మనం భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసుండాలని , ఒకరికొకరు తోడుగా ఉండాలని హితవు పలికారు.

డిల్లీ నుంచి సుల్తాన్ లు,జగిర్దారులు వచ్చినా విశాఖ ఉక్కు పెళ్ళ కూడా పెకిలించలేరన్నారు. వైఎస్సార్ సంకల్పాన్ని నిలబెట్టే వాళ్ళే నిజమైన వారసులని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. డిల్లీ నుంచి మోడీ ఆంధ్రను పాలిస్తున్నాడన్నారు.10 ఏళ్లు అయినా పోలవరం కట్టలేదు. రాజధాని కట్టలేదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇవ్వాళ రెండు రాష్ట్రాల్లో నాయకులు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళే ఉన్నారన్నారు. అనాడు వైఎస్సార్ మొక్కవోని దీక్షతోనే ఇటు రాష్ట్రంలో, అటూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందన్నారు.

ఢిల్లీలో మోడీని నిలదీసే దమ్ము ఇప్పటి నేతలకు లేదన్నారు.అంతా ముత్యాల ముగ్గు బ్యాచ్ అని దెప్పిపొడిచారు. షర్మిలమ్మ ఏపిని కాపాడుతుందన్నారు. నాకు వయసు ఉంది..శక్తి ఉంది వాళ్ళకోసం పోరాటం చేస్తా అని చెప్పిందన్నారు. వైఎస్సార్ బిడ్డగా,ఆయన వారసురాలు గా ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడ నుంచే మొదలు పెడతా అని చెప్పిందన్నారు. షర్మిలమ్మ కి ఇక్కడ అన్ని తెలుసని, ఇక్కడ ఉన్నవి అంబోతులు అని తెలుసన్నారు. విశాఖ ఉక్కు అదానీ కోసం ప్రధాని తెగనమ్ముతుంటే పోరాటం చేయడానికి వచ్చిందన్నారు. వైఎస్సార్ చివరి కోరిక…రాహుల్ ప్రధాని అవ్వాలని , వైఎస్సార్ ఏ రోజు బిజెపితో అంట కాగలేదని, బిజెపికి వైఎస్సార్ ఎప్పుడు బద్ద వ్యతిరేకి అన్నారు. వైఎస్సార్ ఒక సెక్యులర్ అన్నారు. మోడీకి అండగా నిలబడి..ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యుానల్ చేతుల్లో పెట్టాలని అనుకున్నారా? అని టిడిపి జనసేన , వైసిపి పార్టీలను ప్రశ్నించారు. బాబుకి,జగన్కి మోడీని ప్రశ్నించే దమ్ము లేదని, ప్రశ్నించే గొంతుక వైఎస్ షర్మిలా రెడ్డికి ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అని అన్నారని, అక్కడ ఉన్న కేడి ,ఢిల్లీలో ఉన్న మోడీని ఎదుర్కున్నామని, అప్పుడు తాను అధైర్య పడలేదన్నారు. 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ కి ప్రజలు 65 సీట్లు ఇచ్చి నిలబెట్టారన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నిలబెట్టేందుకు షర్మిలమ్మ పోరాటం చేస్తోందన్నారు. షర్మిలమ్మకి తాను అండగా నిలబడతానని, ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసే వరకు తాను అండగా ఉంటానని , ఏ అవసరం వచ్చినా ముందు ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల, సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి , కెవిపి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News