Friday, May 3, 2024

మహారాష్ట్రతో రోటీ బేటీ బంధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ భేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడు మ మొదటి నుంచి సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్య త ఉందని, ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని బిఆర్‌ఎస్ పా ర్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాంటి అనుబంధమున్న మహారాష్ట్ర నుంచే బిఆర్‌ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడం తనకెంతో ఆనందంగా ఉం దన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం సోలాపూర్,నాగపూర్ తదితర ప్రాంతాల నుం చి పలువురు నేతలు తెలంగాణ భవన్‌లో అధినేత సమక్షం లో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

కాలంలో తెలంగాణలో సాధించి న అభివృద్ధి, సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రను కూడా ప్రగతిపథంలో నడిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలకు సిఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా సిఎం కెసిఆర్ మాట్లాడు తూ భారత దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయన్నారు. తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ పదవుల కోసం ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకుఆ పార్టీల ఈ పార్టీలకు జంపులు చేస్తున్నారని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న సంఘటనలను దే శ ప్రజలు గమనిస్తున్నారని సిఎం అన్నారు. ఈ దేశం యువతీ, యువకులదని ఎంతో భవిష్యత్ ఉన్న యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాల్సి ఉందన్నారు. పరివర్తన చెందిన భారతదేశంతోనే అభివృద్ధి సాధ్యమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువత మీదనే ప్రధానంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నాటి భగత్ సింగ్ అల్లూరి వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేసే దిశగా భాగస్వాములు కావాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఇతర దేశాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి…
ఇతర దేశాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎందుకు ఇంకా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని, దేశ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిమీద ఉందని సిఎం అన్నారు. తాను చెబుతున్న విషయాలను గర్తుంచుకొని, గ్రామాలకు వెళ్లాక కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి చర్చించుకోవాల్సిన అవసరముందన్నారు. దేశంలో అవసరానికి మించి అందుబాటులో ఉన్న నదీ జలాలు తదితర సహజ సంపదను, 75 ఏళ్లు గడిచినా ఈ దేశ పాలకులు ఇంకా సరైన రీతిలో వినియోగంలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారన్న విషయాన్ని ఆలోచించా లన్నారు. ప్రపంచంలో మొన్నటి దాకా వెనకబడిన చైనా వంటి దేశాలు నేడు మనం అందుకోలేని స్థాయిలో అభివృద్ధి చెందాయని సోదాహ రణలతో వివరించారు. కేంద్ర పాలకులకు దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు సరైన రీతిలో లేకపోవడమే అందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సభ్య దేశాల ముంగిట అంతర్జాతీయ మార్కెట్లో భారత దేశ ఇజ్జతిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఇటువంటి అభివృద్ధి నిరోధకులకు ఓట్లు వేసుకుంటూ వారిని ఇంకా గెలిపించుకుంటూ, కనీసం తాగునీరు, సాగునీరు విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకెన్నాళ్లు అభివృద్ధి దూరంగా ఉందామని సిఎం ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్‌ను ఆదరించండి
బిఆర్‌ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి గడపముందుకు వచ్చి నిలబడిందని, తలుపులు తెరిచి ఆహ్వానించాలని, బిఆర్‌ఎస్‌ను ఆదరించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. కిసాన్ సర్కార్‌తోనే మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామన్నారు. తెలంగాణలో జరిగినట్టు మహారాష్ట్రలో ప్రగతి ఎందుకు సాధ్యం కాదో చూద్దామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు సాగుతున్న బిఆర్‌ఎస్ పార్టీని మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ సహా యావత్ దేశవ్యాప్తంగా విస్తరిస్తామని సిఎం పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి రావాలని ఆయన సూచించారు.అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కెసిఆర్ హామినిచ్చారు.

మరోసారి సోలాపూర్‌కు….
ఇటీవలే సోలాపూర్ పర్యటించిన తాను తిరిగి మరోసారి సోలాపూర్ రానున్నట్టు అధినేత తెలిపారు. తాను మరోసారి సోలాపూర్ వస్తానని, వారం రోజుల ముందు మంత్రి హరీశ్ రావును అక్కడికి పంపుతానని, పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీ తీద్దామని కెసిఆర్ పిలుపునిచ్చారు. కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగం సభను నిర్వహించుకుందామని ఆయన తెలిపారు. తెలంగాణలో జరిగిన అన్ని తీర్ల అభివృద్ధిని సోలాపూర్ సహా మహారాష్ట్రలో చేసి చూపించే బాధ్యత నాదన్నారు ఇక్కడకు వచ్చిన మీరంతా నా బిడ్డల వంటి వాదని, మీ భవిష్యత్‌కు భరోసా బిఆర్‌ఎస్ పార్టీది, నాదని, మీరు బిఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని, మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత స్వయంగా తాను తీసుకుంటానని కెసిఆర్ స్పష్టం చేశారు.ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇస్తాయని వ్యవసాయాధారిత భారత దేశంలోని పాలకులు అందుకు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే తమ పార్టీ నినాదంతో దేశంలో ఉన్న రైతాంగాన్ని రక్షించుకుందామన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుందామని అధినేత సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణ కన్నతల్లి… మహారాష్ట్ర పెంచిన తల్లి….
తమకు తెలంగాణ కన్నతల్లివంటిదయితే, మహారాష్ట్ర పెంచిన తల్లి వంటిదని పార్టీలో చేరిన మహారాష్ట్ర నేతలు అన్నారు. శనివారం బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో తెలంగాణ నుంచి వలసవెల్లి సోలాపూర్ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. కాగా ఈ సందర్భంగా అధినేత సిఎం కెసిఆర్‌కు వారు స్థానిక గ్రామ దేవత ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సోలాపూర్, నాగపూర్‌ల నుంచి దాదాపు మూడు వందల మందికి పైగా బిఆర్‌ఎస్ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నగేశ్ వల్యాల్ (సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మూడోసారి కార్పొరేటర్) జుగన్ బాయ్ అంబేవాలే (రెండోసారి కార్పొరేటర్) , సంతోష్ భోంస్లే (కార్పొరేటర్) , రాజేశ్వరి చవాన్ (మాజీ కార్పొరేటర్) , జయంత్ హోలెపాటిల్ (బిజెపి ఉద్యోగ్ అఘాడీ ప్రెసిడెంట్), సచిన్ సోంటక్కే (బిజెపి మాజీ కార్పొరేటర్), భాస్కర్ మర్గల్ (మాజీ కార్పొరేటర్) , చేతన్ తుమ్మా, గణేశ్, అరుణ్, నరేశ్, ప్రేమ్, ఓమ్, భాస్కర్, లక్ష్మణ్, నగేశ్, నాగరాజ్, గోవర్ధన్, శ్రీనివాస్, శ్యామ్, శంకర్ తుమ్మ, రమేష్, అజయ్, రాజేష్, రమేశ్, అశోక్, ప్రకాశ్, రాజారామ్ వంటి ప్రముఖులు తదితరులు ఉన్నారు.

నాగ్‌పూర్ డివిజన్ నుంచి..
రాజు యెర్నె, స్పోర్ట్స్ క్లబ్ మెంబర్ నాగార్జున్ మేకల, గోపాల్ గోరంటే, ప్రకాష్, రామకృష్ణ ప్రభు, శామ్ భాను, భూషణ్ కుషే, భూషణ్ మధుకర్ రావు, వాసుదేవ్ ముక్తి, మహేంద్ర ఠాకూర్, రంగా రావు, మమతా, బాల సాహెబ్ దామోదర్, రంగా రావు, రూపేష్ కుమార్ గవాయ్, రాజు యేర్నే వంటి ప్రముఖులు నాగ్‌పూర్ డివిజన్ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమాన్ని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మంత్రి తన్నీరు హరీశ్ రావు సమన్వయం చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్‌సిలు తక్కెల్లపల్లి రవీందర్ రావు, మధుసూధనాచారి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాల చారి, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్లు రవీందర్ సింగ్, సోమా భరత్ కుమార్ పార్టీ నేతలు కల్వకుంట్ల వంశీధర్ రావు, బండి రమేశ్, రాకేశ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News