శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో 2016 లో భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన ముజఫర్ వనీ పుల్వామాజి జిల్లా ట్రాల్ లోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రత్యేకతను సంతరించుకుని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. హిజుబుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అయిన బుర్హాన్ వనీ 2016 జులైలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. దీంతో కశ్మీర్లో ఐదు నెలలపాటు ఆందోళనలు సాగాయి. వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర పాలిత పాలనా యంత్రాంగం అన్ని విభాగాలకు విద్యా విభాగంతో సహా కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు అన్ని పాఠశాలల్లో పతాకావిష్కరణలు నిర్వహించారు.