Saturday, May 4, 2024

జెడిఎస్ రాజ్యసభ అభ్యర్థిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తున్న జెడిఎస్ అభ్యర్థి డి కుపేంద్ర రెడ్డిపై, ఆయన అనుచరులపైన బెంగళూరులోని విధాన సౌథ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు జెడిఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మంగళవారం తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించినందుకు జెడిఎస్ అభ్యర్థి కుపేంద్ర రెడ్డిపై పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ధ్రువీకరించారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని, బెదిరించారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అభ్యర్థి కుపేంద్ర రెడ్డిపైన, ఆయన అనుచరులపైన ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారని కుమారస్వామి తెలిపారు. తనను ప్రలోభపెట్టారని ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యే చెప్పలేదని, కాని మరి కొందరు ఎమ్మెల్యేలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. తన ఓటు కావాలని కొందరు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని కర్నాటక సర్వోదయ పక్షకు చెందిన మేలుకోటె ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య చెప్పారని కుమారస్వామి తెలిపారు.

జెడిఎస్‌కు చెందిన 19మంది ఎమ్మెల్యేల ఓట్లతోపాటు బిజెపికి ప్రాధాన్యతా ఓట్లతో తర్వాత మిగిలే ఓట్లు తమ అభ్యర్థి కుపేంద్ర రెడ్డికి లభించాలని నిర్ణయించామని యన వివరించారు. కాగా, తన అభ్యర్థి కుపేంద్ర రెడ్డిని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జెడిఎస్ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. తన అభ్యర్థి గెలవడానికి జెడిఎస్‌కు 45 ఓట్లు కావాలని, అన్ని ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నించారు. తగినన్ని ఓట్లు లేనప్పటికీ తన అభ్యర్థిని ఎన్నికలలో నిలబెట్టి కాంగ్రెస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు జెడిఎస్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. జెడిఎస్‌కు అంతరాత్మ ఉందా అంటూ ఆయన నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News