Sunday, April 28, 2024

కరెంటుపై తలొగ్గిన కేంద్రం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలనే డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్లుగా ఉందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధాన్ని పెంచడానికి ఉపక్రమించిందని అధికారవర్గాలు తెలిపాయి. దేశ ప్రజల విద్యుత్తు అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని వివరించారు. దేశంలో ఇప్పటికీ సుమారు 18,500 గ్రామాలకు విద్యుత్తు సరఫరా లేదని, కరెంటు బల్బు అంటే ఏమిటో కూడా తెలియని కుటుంబాలు  2.30 కోట్లు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. అంతేగాక పేరుకు వ్యవసాయ ఆధారిత దేశంగా ప్రపంచం గుర్తించినప్పటికీ రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ధిష్టమైన రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ విమర్శల నుంచి కొంతమేరకైనా బయటపడేందుకు విద్యుత్తు రంగంలో కొన్ని మార్పులు చేయాలని సంకల్పించినట్లుగా ఉందని ఆ అధికారులు వివరించారు.

2032వ సంవత్సరం నాటికి దేశంలో అదనంగా 3,78,370 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఏ) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం దేశంలో విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధం 4,16,059 మెగావాట్ల వరకూ ఉందని, సిఇఏ నివేదికను కేంద్రం అమలు చేస్తే 2032వ సంవత్సరం నాటికి దేశంలో మొత్తం 7,94,429 మెగావాట్లకు విద్యుత్తు ఉత్పత్తి సామర్ధం పెరుగుతుందని విద్యుత్తుశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సిఇఏ నివేదికను అమలు చేస్తుందా? లేదా? అనేది ఇంకా స్పష్టతరాలేదని ఆ అధికారులు వివరించారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయని, సాగునీటి కొరత లేకుండా సమగ్ర ప్రణాళికతో వ్యవసాయ రంగానికి అండదండలు అందిస్తున్నందున, తెలంగాణ రైతాంగ విధానాలను తమతమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయని, అందులో భాగంగానే విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని పెంచడానికి సిఇఏ అధ్యయనం చేసి మరీ నివేదికను రూపొందించిందని ఆ అధికారులు వివరించారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న 4,16,059 మెగావాట్ల విద్యుత్తులో వ్యవపాయ రంగంగానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 17.67 శాతం మాత్రమే కరెంటును సరఫరా చేస్తున్నారని, అంతేగాక గృహ వినియోగానికి 25.77 శాతం, పరిశ్రమలకు 41.18 శాతం, వాణిజ్య రంగాలకు 8.29 శాతం మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నారని, పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో ఎలాంటి అభివృద్దీ జరగదని, పరిశ్రమలు కూడా మూతబడిపోతాయని ఆ అధికారులు తెలిపారు. ఇప్పటికీ దేశంలో 18,500 గ్రామాలకు విద్యుత్తు సరఫరా లేదని, అంతేగాక ఏకంగా 2.30 కోట్ల కుటుంబాలకు కరెంటు బల్బు అంటే ఏమిటో కూడా తెలియదని ఆ అధికారులు వివరించారు. ఇలాంటి చేదు నిజాలను పక్కనబెట్టి దేశం వెలిగిపోతోందని, గప్పాలు కొట్టుకుంటే సరిపోదని ఇటీవల మహారాష్ట్ర పర్యటనల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ఆరోపణలు, విమర్శలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎక్కడో తగిలాయని, అందుకే మనసు మార్చుకొని విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని పెంచడానికి ప్రయత్నాలను ప్రారంభించినట్లుగా ఉందని ఆ అధికారులు వివరించారు.

దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలన్నా, పారిశ్రామికంగా పెట్టుబడులను రాబట్టుకోవాలన్నా కనీసం 10 లక్షల మెగావాట్లకు విద్యుత్తు ఉత్పత్తి సామర్దాన్ని పెంచుకోవాల్సి ఉందని వివరించారు. ఈ నేపధ్యంలోనే సిఇఏ ఇచ్చిన సిఫారసులు కేవలం మూడు లక్షల మెగావాట్ల అదనపు ఉత్పత్తికి పరిమితం కావడంలో సబబుగా లేదని అంటున్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఘాటు విమర్శలను పరిగణనలోకి తీసుకొన్నప్పటికీ ఆ దిశగా సాంకేతికపరమైన అధ్యయనాలు జరిపి ఉచిత విద్యుత్తుకు అవసరమైన సామర్ధాన్ని పెంచుకునే విధంగా కేంద్రానికి నివేదిక ఇచ్చి ఉన్నట్లయితే బాగుండేదని అంటున్నారు. విద్యుత్తు సరఫరా లేని 18,500 గ్రామాలను పరిగణనలోకి తీసుకొని నిరుపేదలకు సబ్సిడీపై కరెంటును సరఫరా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లయితే బాగుండేదని అంటున్నారు. కరెంటు బల్బు అంటే ఏమిటో తెలియని రెండు కోట్ల 30 లక్షల కుటుంబాలకు సబ్సిడీపై విద్యుత్తును సరఫరా చేయడానికి కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉండిందని, ఆ పని చేయకపోవడం బాధాకరమని అంటున్నారు.
రూ.33 లక్షల కోట్ల నిధులు అవసరం
వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, ఇతర విద్యుత్ అవసరాలకు ఇది సరిపోతుందని, జాతీయ విద్యుత్ ప్రణాళిక (ఎన్‌ఇపి)2022-32 ప్రకారం దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విద్యుత్ రంగానికి 2032 సంవత్సరం నాటికి రూ.33 లక్షల కోట్ల పెట్టుబడి, 3.78 మిలియన్ల విద్యుత్ నిపుణులు అవసరమని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఎ) నివేదిక తెలిపింది. అంతే కాకుండా రాబోయే పది సంవత్సరాలకు 3,78,370 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని పేర్కొంది. వీటిలో రెన్యువబుల్ ఎనర్జీ (2,59,722 మెగావాట్లు), థర్మల్ విద్యుత్ (25,480 మెగావాట్లు), అణు విద్యుత్ (6,600 మెగావాట్లు), జల విద్యుత్ (9,732 మెగావాట్లు) మొత్తం 2,91,802 మెగావాట్లు విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేసేందుకు సిఈఏ ప్రతిపాదించింది. చిన్నతరహా హైడ్రో (250 మెగావాట్లు), పవన విదుత్తు రంగంలో 47,500 మెగావాట్లు, పవన (ఆఫ్‌షోర్) 15 వేల మెగావాట్లు, బయోమాస్ (2,500 మెగావాట్లు ), పంపు నీళ్ళుప్లాంట్లు (19,240 మెగావాట్లు)కు 2.40 లక్షల సిబ్బంది అవసరం ఉండగా వీటిలో టెక్నికల్ సిబ్బంది 1,74,210 మంది , నాన్ టెక్నికల్ సిబ్బంది 53,190 మంది అవసరం ఉంటుందని నివేదికలో పేర్కొంది.

అయితే రాబోయే ఐదు సంవత్సరాల్లో మన దేశ విద్యుత్ డిమాండ్ 2,11,819 మెగావాట్లు మాత్రమే ఉంటుందని పేర్కొంది. వీటిలో సౌర, బ్యాటరీ వంటి రెన్యువబుల్ ఎనర్జీ (1,79,939 మెగావాట్లు), అణు విద్యుత్ (6,300 మేగావాట్లు) థర్మల్ విద్యుత్ (25,580 మెగావాట్లు ) మాత్రమే ఉంటుందని వెల్లడించింది. ఇందుకు కాను ఒక లక్షా 50 వేల మంది సిబ్బంది అవసరం ఉండగా వీరిలో ఒక లక్షా 15 వేల 548 మంది సాంకేతిక సిబ్బంది అవసరం ఉండగా నాన్- టెక్నికల్ సిబ్బంది 35,490 మంది అవసరం ఉంటుందని వెల్లడించింది. సిఇఎ నివేదిక ప్రకారం విద్యుత్ సామర్ధం పెంపు కోసం మొత్తం 33,60,594 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని పేర్కొంది. అయితే ఈ అంచనాలో క్యాప్టివ్ పవర్ ప్లాంట్లతో పాటు ఇప్పటికే ఉన్న పవర్ ప్లాంట్ల పునరుద్ధరణ, ఆధునీకరణ కోసం అవసరమైన నిధులు లేవని వెల్లడించింది. అయితే విద్యుత్ సామర్ధాన్ని మరింత పెంచుకునేందుకు అవసరమైన వనరులను సమీకరించు కోవడమే కాకుండా టెక్నికల్, నాన్‌టెక్నికల్ సిబ్బంది శిక్షణ ఇవ్వడం కూడా ఎంతో ముఖ్యమైందని అప్పుడే అనుకున్న లక్షాన్ని చేరుకోవచ్చని తన నివేదికలో వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News