న్యూఢిల్లీ: కరోనా సంబంధిత లాక్డౌన్తో దెబ్బతిన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రాలకు అదనపుమూలధన వ్యయం, కింద ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12000 కోట్లు వడ్డీలేని రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు ఈ అప్పులను 50 ఏళ్ల తరువాత తిరిగి చెల్లించుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ రూ 12000 కోట్ల ప్యాకేజీలో ఈశాన్య రాష్ట్రాలకు రూ 1600 కోట్లు, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లకు కలిపి రూ 900 కోట్లు పోనూ మిగిలిన రాష్ట్రాలకు రూ 7500 కోట్లు రుణంగా ఇస్తారు. కొత్త లేదా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూలధన ప్రాజెక్టుల పరిధిలో వ్యయం కోసం రాష్ట్రాలు ఈ రుణాలను వినియోగించుకోవచ్చునని మంత్రి వివరించారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, సరఫరాదార్ల బిల్లులను రాష్ట్రాలు ఈ రుణపరపతిద్వారా చెల్లించుకోవల్సి ఉంటుంది.
రాష్ట్రాలు 2021 మార్చి 31వ తేదీలోగా ఈ బిల్లులను ఈ రుణాల ద్వారా పరిష్కరించుకోవాలి. రాష్ట్రాలు తీసుకునే ఈ మూలధన రుణ తిరిగి చెల్లింపునకు 50 ఏండ్ల వరకూ గడువు ఉంటుంది. దేశంలో రహదారులు, రక్షణ మౌలికవసతుల కల్పనకు, నీటి సరఫరా, పట్టణాభివృద్ధి ఇతరత్రాలకు రూ 25000 కోట్ల అదనపు బడ్జెట్ను సమకూరుస్తారని ఆర్థిక మంత్రి తెలిపారు. 202020 బడ్జెట్లో రూపొందించిన రూ 4.13లక్షల కోట్ల మూలధన వ్యయ కేటాయింపులకు ఇది అదనపు మొత్తం అని మంత్రి చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణాలను కేంద్ర ఆర్థిక సంఘం కేటాయింపుల వాటాకు అనుగుణంగా ఖరారు చేస్తారు. ముందుగా రుణంలో సగభాగం ఇచ్చి తరువాతి క్రమంలో వాటి వాడకాన్ని బట్టి మిగిలిన రుణాన్ని సమకూరుస్తారు. ఇక ప్రస్తుత ఉద్దీపన చర్యలతో 2021 మార్చి 31 నాటికి రూ 73000 కోట్ల మేర కన్సూమర్ డిమాండ్ ఇనుమడిస్తుందని మంత్రి తెలిపారు. ఇందులో ఉద్యోగులకు ఇచ్చే రుణాలు, ఎల్టిసి నగదు ఓచర్లతో రూ 36000 కోట్లు, రాష్ట్రాలకు మూలధన వ్యయ కేటాయింపుల క్రమంలో మొత్తం రూ 37000 కోట్లు మేర కన్సూమర్ డిమాండ్ ఏర్పడుతుందని మంత్రి వివరించారు. వీటి మొత్తం విలువను ఆమె తెలియచేశారు.
Central to give Rs 12000 crore interest free loans to states