Sunday, April 28, 2024

చంద్రబాబు వారసుడు ఏజెంట్ రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -
  • మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానం
  • మూడు పంటలు అనేది బిఆర్‌ఎస్ యొక్క నినాదం
  • ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను పల్లె పల్లెకు తీసుకువెళతాం
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్: ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సిఎం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బిజెపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ సారథ్యంలో రైతులు ఇప్పుడు ఇప్పుడే ఆర్ధికంగా కోలుకుంటున్నాని ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం చాలా దారుణమన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాత్రి 4 గంటలు, పగలు 3 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేదని లోఓల్టెజీ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు పెలిపోయేవన్నారు. మూడు గంటల విద్యుత్ చాలని రేవంత్ రెడ్డి, మోటార్లకు మీటర్లు పెడతామని బిజెపి చెప్పడం చూస్తుంటే రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ప్రతి పక్షాల తీరుతుందని విమర్శించారు. మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అంటున్న చంద్రబాబు వారసుడు, ఏజెంట్ రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానమైతే మూడు గంటలు అనేది బిఆర్‌ఎస్ యొక్క నినాదం అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎరువుల కోసం రైతులు క్యూలైనులో నిల్చుండే పరిస్థితి ఉండేదన్నారు. కరెంటు లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గత కాంగ్రెస్ హయాంలో ఉండేవన్నారు.

చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి ఇప్పించాడని ఇవాళ్ల కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నాయకులు అంటున్నారని చెప్పారు. రైతులను చైతన్య వంతం చేసి కాంగ్రెస్‌ని రేవంత్ రెడ్డిలను నిలదీసే విధంగా సభలు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. గజ్వేల్ నియోజక వర్గ వ్యాప్తంగా మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇప్పటి వరకు 12 వేల ఆప్టికేషన్స్ వచ్చాయన్నారు. రోజు 250 మందికి లర్నింగ్ ఇస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆప్లై చేయని యెడల గజ్వేల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆప్లికేషన్ పెట్టుకొవాలని తెలిపారు. గజ్వేల్ నియోజక వర్గంలో దాదాపు పదివేల మందికి గృహ లక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్, సర్పంచ్ సత్యం, నాయకులు కుమార్ యాదవ్, నగేశ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News