Thursday, May 2, 2024

రామోజీపై చీటింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. ఈసారి సంస్థ మాజీ షేర్ హోల్డర్ ఫిర్యాదు చేశారు. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి.జగన్నథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండి శైలజా కిరణ్‌లపై ఎపి సిఐడి కేసు నమోదు చేసింది. సెక్షన్ 420, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపిసి కింద కేసు నమోదైంది. కేసులో ఎ1గా రామోజీరావు, ఎ2గా శైలజా కిరణ్ ను చేర్చారు.

మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో వెల్లడించారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. 2016 సంవత్సరం నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.1,59,69,600 ( కోటి 59 లక్షల 69 వేలు) కాగా, రామోజీరావు కేవలం రూ.39,74,000 (39 లక్షల 74 వేలు) యూనియన్ బ్యాంక్ చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను సంతకం పెట్టలేదని, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని యూరిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు. అందుకుగానూ మార్గదర్శిలో తండ్రి జగన్నాథరెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని తెలిపారు. తన తండ్రికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్ మెంట్ కోరగా చాలాకాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. 29 సెప్టెంబర్ 2016లో రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇటీవల తమ షేర్ హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి తెలిపారు. తిరిగి 2 అక్టోబర్ 2016న తన తండ్రి వాటను తన పేరిట మార్చాలని సోదరుడికి ఏ ఇబ్బంది లేదని చెప్పాడు. అఫిడవిట్ పై సంతకం చేయాలని రామోజీరావు కోరడంతో, ఓ పేజీ ఖాళీగా ఉందని సంతకం చేయనని చెప్పగా తుపాకీతో ఆయన తనను బెదిరించి సంతకం చేయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమ షేర్లు వేరే వాళ్లకు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడంతో రామోజీరావు ఇచ్చిన చెక్ ను నగదుగా మార్చలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు యూరిరెడ్డి సిఐడిని ఆశ్రయించారు.

అలా ఫిర్యాదు.. ఇలా క్యాష్ పిటిషన్…
యూరి రెడ్డి ఫిర్యాదుతో ఎపి సిఐడి పోలీసులు కేసు నమోదు చేయగానే రామోజీ రావు వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ మంగళవారం హైకోర్టు ముందు విచారణకు రాబోతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిర్వహణలో చందాదారులను మోసం చేసినందుకు ఇటీవల కేసులు ఎదుర్కొంటున్న రామోజీ ఇప్పుడు పార్టనర్స్‌ని చీట్ చేసినందుకు కూడా కేసులు ఎదుర్కోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News