Friday, May 3, 2024

పోలీస్ సిబ్బంది నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు..

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : మెడికల్ సంబంధిత ధృవపత్రం కోసం పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సిబ్బంది తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆళ్లపల్లి పిహెచ్‌సి డాక్టర్ రేవంత్ అన్నారు. ఆదివారం ఇల్లందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తొలి పోస్టింగ్ 2023 ఏడాదిలో ఆళ్లపల్లి ప్రభుత్వ వైద్య శాలలో నియామకం జరిగిందని, అయితే 2022 సంవత్సరంలో తన సంతకంతో కూడిన మెడికల్ సర్టిఫికెట్‌ను ఓ పోలీస్ ఫోర్జరీ చేశారని వివరించారు. అప్పట్లో ఈ విషయం తెలియక పోవడంతో మిన్నకుండి పోయానని అయితే ఈ ఏడాది కూడా మరోసారి తన సంతకం అవసరం కావడంతో తిరిగి ఫోర్జరీ చేసేందుకు ప్రయత్నించడంతో సంబంధిత వ్యక్తులు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు.

ఈ విషయాన్ని ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని చెప్పారు. పైగా తనపై ఎస్‌సి, ఎస్‌టి కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ విషయమై సిఐ కరుణాకర్‌ను మన తెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవమేనని దర్యాప్తు చేయకుండా కేసు ఎలా నమోదు చేస్తామని అన్నారు. సంబంధిత పత్రాలను ఫోరెన్సీక్ ల్యాబ్‌కు పంపించి అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News