Thursday, May 2, 2024

నాన్సీ పెలోసిపై చైనా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

China sanctions Nancy Pelosi

తైవాన్‌ను సందర్శించకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు: పెలోసి

బీజింగ్: తన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్‌లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసిపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకుగాను ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. అయితే పెలోసిపై చైనా ఆంక్షలు సింబాలిక్ మాత్రమేనని, ఆమె, ఆమె కుటుంబ సభ్యులు చైనాలో పర్యటించకుండా మాత్రమే నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెలోసి తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేసింది. గత 25 ఏళ్లలో తైవాన్ సందర్శించిన అతిపెద్ద అమెరికా నేత పెలోసియే కావడం గమనార్హం. తైవాన్‌ను తమ అంతర్భాగంగా చైనా పేర్కొంటున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న పెలోసి టోక్యోలో విలేఖరులతో మాట్లాడుతూ తైవాన్‌కు వెళ్లకుండా తమను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ‘తైవాన్‌ను ఒంటరి చేయాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా అడ్డుకోలేరు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలన్నదే మా ప్రయత్నం’ అని పెలోసి అన్నారు. మరోవైపు పెలోసి పర్యటనకు నిరసనగా చైనా తైవాన్ సమీపంలో పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ధ విన్యాసాలను అమెరికా ఖండించింది. వీటిని కవ్వింపు చర్యలుగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభివర్ణించారు. గురువారం రాత్రి పొద్దుపోయాక టోక్యో చేరుకున్న పెటోసి జపాన్ ప్రధాని ఫ్యుమో కిషిడాతో భేటీ అయ్యారు. కాగా పెలోసి తైవాన్ సందర్శనకు కొద్ది రోజుల ముందు జపాన్ మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబాతో పాటుగా జపాన్ పార్లమెంటు సభ్యుల బృందం ఒకటి తైవాన్ సందర్శించి తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్‌వెన్‌తో ప్రాంతీయ భద్రతపై చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News