ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి గట్టిగా స్పందించడం హాట్ టాపిక్గా మారింది. సినిమా టికెట్ల ధరల పెంపు, చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారంపై గత ప్రభుత్వ హయాంలో ఏపి సిఎం వైఎస్ జగన్ను చిరంజీవి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల బృందం కలిసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగడం విశేషం. ఏపి అసెంబ్లీలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్… చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో మాట్లాడి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని, సీఎంను ఎవరెవరు కలువాలో జాబితాను తయారు చేశారని అక్కడ జరిగిన పరిణామాలను వివరించారు. జగన్ నివాసం వద్ద సినీ ప్రముఖుల కారును భద్రత సిబ్బంది ఆపివేశారని, అనంతరం సీఎంకు బదులుగా నాటి సినిమాటోగ్రఫీ మంత్రి చర్చలు జరుపుతారని సమాచారం వచ్చిందని కామినేని శ్రీనివాస్ అన్నారు.
దీంతో చిరంజీవి గట్టిగా అభ్యంతరం తెలుపడంతో జగన్తో సమావేశం జరిగిందని వెల్లడించారు. దీనిపై బాలకృష్ణ మాట్లాడుతూ… “చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ దిగివచ్చారన్నది అబద్దం. చిత్ర పరిశ్రమకు అవమానం జరిగింది మాత్రం నిజం”అని అన్నారు. నాడు సైకో జగన్ వద్ద జరిగిన సమావేశంలో గట్టిగా ఎవ్వరూ మాట్లాడలేదని బాలకృష్ణ తెలిపారు. దీంతో అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్పై చిరంజీవి స్పందించారు. “అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లా. నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కు వివరించా. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను. నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను వివరణ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి ఏపి ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్బాబు, డివివి దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడాను.
టికెట్ల ధరల పెంపు విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ముందు మీతో కలుస్తారని తెలిపారు. లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అంద రూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ని వెళ్లి బాలకృష్ణని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి కొందరు సినీ ప్రముఖులము అంతా వెళ్లి ముఖ్యమంత్రిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను.
సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను”అని చిరంజీవి పేర్కొన్నారు.
Also Read: ఆర్టిసి బస్సెక్కితే బహుమతులు