కరోనాతో పోరాడుతున్న సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ పేర్కొంది. రాజశేఖర్ కోవిడ్ చికిత్స కోసం ఇటీవల సిటీ న్యూరో సెంటర్లో చేరారు. తాజాగా హాస్పిటల్ యాజమాన్యం రాజశేఖర్ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది. ఇక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ శివాత్మిక గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. తన తండ్రి గురించి అందరూ ప్రార్థనలు చేయాలని కోరింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అనంతరం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని శివాత్మిక మరో ట్వీట్ చేసింది. ఇక రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. “డియర్ శివాత్మిక.. మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మా అందరి ప్రార్థనలు, మద్దతు ఆయనకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి”అని చిరంజీవి పేర్కొన్నారు.
Chiru wish Rajasekhar a speedy recovery from corona