న్యూఢిల్లీ: చైనా తరువాత అత్యధిక జనాభా కలిగిన భారత్లో కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటు లోకి తీసుకురాడానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్టు అనధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన భారత్లో ప్రతివ్యక్తికి వ్యాక్సిన్ అందించడానికి దాదాపు ఆరు నుంచి ఏడు డాలర్ల వరకు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసినట్టు ఆయా వర్గాల సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ కేటాయింపు జరిగిందని, వ్యాక్సిన్ సరఫరాకు నిధుల కొరత అంటూ ఉండక పోవచ్చని ఆయా వర్గాలు అభిప్రాయ పడ్డాయి. ఈమేరకు ఒక్కో వ్యక్తికి రెండు ఇంజెక్షన్ల కొవిడ్ టీకాను అందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఒక్కో డోస్ విలువ రెండు డాలర్లుగా ఉండవచ్చని అంచనా. మరో రెండు డాలర్లు నిల్వ, పంపిణీకి ఖర్చవుతుందని లెక్క కట్టారు.
అయితే, దీనిపైన ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేంద్రం నియమించిన కొవిడ్ కమిటీ ఆదివారం దేశంలో కరోనా తీవ్రత గరిష్ట స్థాయిని మించి పోయిందని అన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా కేసులను కొంతవరకైనా నియంత్రించ వచ్చని కమిటీ వివరించింది. వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా కనిపించింది. దాంతో లాక్డౌన్ ఎత్తివేశారు. దాదాపుగా అన్ని కార్యకలాపాలు తిరిగి పుంజుకునేలా కేంద్రం అనుమతించింది. ఇదిలా ఉండగా పండగల సీజన్ కూడా మరో వైపు మొదలయ్యింది. దీంతో కేసుల సంఖ్య పెద్దెత్తున పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి కేరళలో ఇటీవల జరిగిన ఓనం పండగనే ఉదాహరణగా చూపిస్తున్నారు. సెప్టెంబర్లో కేరళలో కేసులు అమాంతంగా పెరిగిపోడానికి ఓనం పండగ ఒక కారణంగా చెబుతున్నారు. అందుకని పండగలు చేసుకున్నా జనం గుమికూడ కుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది, మాస్క్లు ధరించడం, శానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, దూరం పాటించడం ఇవన్నీ కొనసాగించక తప్పదు.
Central Govt to spend rs 50000 Cr for Corona Vaccine