మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో శుక్రవారం నాడు క్రిస్టమస్ వేడుకలను బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్రెడ్డి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ప్రభువును ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మహాదేవాలయం(చర్చి) మెదక్ పట్టణంలో ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ క్రైస్తవ సోదరులు క్రిస్టమస్ వేడుకలను జరుపుకునేందుకు హాజరయ్యారన్నారు. వచ్చే భక్తులకు కోవిడ్ నిబంధనలతో కూడిన ప్రత్యేక ఏర్పాట్లను పాలక మండలితో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాకుండా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి అన్ని మతాలను సమానదృష్టితో చూసి క్రైస్తవులకు క్రిస్టమస్ నూతన దుస్తుల పంపిణీ చేయడం జరిగిందని, ప్రజలందరిపై ఏసుక్రీస్తు కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు క్రిస్టమస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ, సిఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు… పరలోకంలో ఉన్న ఏసు ప్రభువు మళ్లీ భూలోకమున జన్మించిన అత్యంత పవిత్రమైన దినమని బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ భక్తులకు సందేశాన్నిచ్చారు. ఉదయం 4 గంటలకు మహారాధనతో మొదలైన క్రిస్టమస్ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రభువును మదిలో స్మరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, భజనలు నిర్వహించారు.
ఏసుప్రభువు జన్మ స్థలమైన పశువుల పాకను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ప్రార్థలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ప్రత్యేక సిలువతో చర్చి ప్రాంగణం నుండి మహాదేవాలయంలోకి బిషప్ సాల్మాన్రాజ్ తోటి పాస్టర్లతో సహా వచ్చి ప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తన ప్రసంగం ద్వారా ఏసు ప్రభువు కరుణామయుడని, లోకకళ్యాణం కోరకే ప్రభువు భూమిపై జన్మించాడని తెలిపారు. ఎటువంటి బయానక, ఆందోళన కరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కరుణామయుని ప్రార్థనలు చేయాలని భక్తులకు సూచించారు. అత్యంత భక్తి శ్రద్దలతో విచ్చేసిన భక్తులందరు మనస్సుపెట్టి ప్రభువును వేడుకుంటే తమ కోరికలను తీర్చడమేకాకుండా సమస్థ కుటుంబావలిని ఆయురారోగ్యాలతో చల్లంగా చూస్తాడని ఆయన భక్తులకు దైవ సందేశాన్నిచ్చారు. ఈ వేడుకల్లో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఫాస్టర్లు, మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్చైర్మేన్ మల్లికార్జున్గౌడ్, స్థానిక కౌన్సిలర్లతోపాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.