Friday, May 10, 2024

తెలంగాణలో రెచ్చిపోతున్న మతోన్మాదశక్తులు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR fire on BJP in Telangana samaikyatha vajrotsavam

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న క్రమంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. సిఎం కెసిఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలని సూచించారు. కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణమని కెసిఆర్ చెప్పారు. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించిందని, తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చిందని, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చిందని, ఆ చరిత్రంతా తాను వేరే చెప్పనక్కరలేదని, అది మనందరి ప్రత్యక్ష అనుభవమని, సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమేనని చెప్పారు.

హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయని బాధను కెసిఆర్ వ్యక్తం చేశారు.  అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదని, అందుకే నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలని సూచించారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నారని, తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నారని, విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని, మత చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే, దేశంలో,  రాష్ట్రంలో అభివృద్ధి కబళిస్తుందన్నారు. మానవ సంబంధాలనే మంట గలుపుతుందని, జాతి జీవనాడిని కలుషితం చేస్తుందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని, ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

తెలంగాణ సమాజం అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందిస్తుందని,  తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుందని, అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలన్నారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల వంటి కుటిల యత్నాలను తిప్పికొట్టాలని సూచించారు.  మత కల్లోల విషయంలో రెప్పపాటు కాలం అదమరిచినా సమాజంలో ఘర్షణలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలియజేశారు.

అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా, ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం, నా గురుతర బాధ్యత అని చెప్పారు.

మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ తాను కోరుకునేది ఒక్కటేనని, ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దని, తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దని, తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోవాలని ఆకాంక్షించారు. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలని కోరుకున్నారు. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మన వంతు దోహదం చేద్దామని, అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఓం సహనావవతు సహనౌ భునక్తు,
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై,
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
మనం పరస్పరం కాపాడుకుందాం..
లోకంలోని సంపదను సమంగా అనుభవిద్దాం..
మనం వీరులమై, పరాక్రమశీలురమై జీవిద్దాం..
మన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం..
మనం విద్వేషాలను విడనాడి, విశ్వశాంతిని సాధిద్దాం..
జై హింద్ …… జై తెలంగాణ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News