జనగాం: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యం పొందారని దానికి కృషి చేసిన సర్పంచ్లు, ఎంపిటిసిలు, అధికారులకు సెల్యూట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఒకపక్క కరోనా వైరస్ విజృంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్య నిర్మూలన, పచ్చదనం, డంపింగ్యార్డు, వైకుంఠదామాలను నిర్మించి సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కావాలన్నా అక్కడి ప్రజల్లో చైతన్యం ఉంటే అవి పునరావృతం కావన్నారు.
దానికి నిదర్శనమే ఈ సంవత్సరం సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూ, జ్వరాలు మరణాలు అత్యధిక స్థాయిలో పడిపోయిందన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్లనే డెంగ్యూ జ్వరాలు ప్రభల లేదన్నారు. జిందగిలో గ్రామానికో పల్లె ప్రకృతి వనం వస్తుందని ఎప్పుడైనా ఊహించారా అని సిఎం అన్నారు. ఒకరు చనిపోతే వారిని దహనం చేయడానికి స్మశాన వాటిక ఉండేది కాదన్నారు. సొంత స్థలాలు లేని ప్రజలకు కుటుంబసభ్యున్ని దహనం చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామానికి కావాల్సిన మౌళిక వసతులను సమకూరాయంటే అది స్థానిక ప్రజాప్రతినిధుల ఘనతేనన్నారు.