Monday, May 6, 2024

రైతుబంధు లేదు.. రూ.500 బోనస్ బోగస్ అయ్యింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్జాలబాయి వద్ద, మిర్యాలగూడ సమీపంలోని మాడ్గులపల్లిలో దాబా దగ్గర ఆగి స్థానిక నేతలు, ప్రజలతో కెసిఆర్ చర్చించారు. ఆర్జాలబాయి వద్ద ఐకెపి సెంటర్‌ను కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేపట్టారు.

కెసిఆర్‌తో రైతులు మాట్లాడుతూ, 20 రోజుల నుంచి కల్లాల్లో ఒడు ్లపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని.. రైతు బతుకు అంతా ఆగమైందని తమ సమస్యలను కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బిఆర్‌ఎస్ హయాంలో నడి ఎండాకాలంలో నీళ్లు మత్తళ్లు దునికేవని.. మీరు ఉన్నప్పుడే అప్పుడే బాగుండే సార్.. మళ్లీ మీ పాలనే రావాలని నినదించారు. రైతుబంధు లేదని.. రూ.500 బోనస్ అని చెప్పినా బోగస్ అయ్యిందని విమర్శించారు.

కష్టపడి పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరని.. ఇక బోనస్ ఏమిస్తారు సార్ అని.. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యిందంటూ విమర్శించారు. ఈ సందర్భంగా కెసిఆర్ స్పందిస్తూ.. మళ్లీ పోరాడి సాధించుకుందాం.. నీళ్లు కరెంటు మళ్లీ తెచ్చుకుందాం.. పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి వద్ద కెసిఆర్ వాహనాన్ని రైతులు ఆపి తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మాడ్గులపల్లి దాబా దగ్గర ఆగి రైతులతో సమస్యలు చర్చించిన సందర్భంగా రైతులు తాగునీరు, సాగునీరు సమస్యలు కెసిఆర్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని అందించిన ఛాయ్‌ను కెసిఆర్ స్వీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News