జనగామ: రైతులు పడుతున్న కష్టాలు సగటు రైతుగా మనకు తెలుసని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతును బలోపేతం చేయడానికి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తాను బతికున్నంత కాలం రైతు బంధు పథకం కొనసాగుతుందన్నారు. దాన్ని ఎవరు కూడా మార్చలేరన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి 24 గంటల విద్యుత్ను అమలు చేస్తున్నామని ఇది ఏరాష్ట్రంలో కూడా సాధ్యపడడం లేదన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని, ప్రతిరైతు అప్పులన్ని తీర్చుకొని రూ.3 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉండేంతవరకు రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కౌలు రైతు విధానాన్ని తాను పట్టించుకోబోమన్నారు. కౌలు రైతు చట్టం ద్వారా అసలు రైతుకు ఎసరు వస్తుందన్నారు.
మూడు సంవత్సరాల పాటు కౌలుకు తీసుకున్న రైతుకు హక్కులు సంక్రమించే విధంగా రెవెన్యూ చట్టంలో లొసుగులు ఉన్నాయని వాటిని పరిగణనలోకి తీసుకునే కౌలు రైతు చట్టాన్ని తొలగించామన్నారు. ప్రతిపక్షాలు కౌలు రైతు చట్టంపై గగ్గోలు పెడుతున్నారని వారికి అంత ప్రేమే ఉంటే రాష్ట్ర రాజధానిలోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్లోని అద్దెలకిచ్చే ఇండ్లకు కూడా కౌలు చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుందన్నారు. పెద్దలకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయం లాగా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం భూముల సర్వే జరుగుతుందన్నారు. ఈ సమగ్ర భూ సర్వేకు రైతు వేదికల, రైతు సమితిలు, సర్పంచ్లు, ఎంపిటిసిలు బాధ్యత తీసుకోవాలన్నారు. భూసర్వేల వల్ల ప్రతి రైతు భూమికి రక్షణ ఉండేందుకు ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు.