Friday, May 3, 2024

బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై మంగళవారం ఫిర్యాదు నమోదైంది. వెంచర్ క్యాపిటలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా భోపాల్ ఎంపి ప్రజ్ఞాసింగ్‌పై సోషల్ మీడియా వేదికగా శివమొగ్గ ఎస్‌పి జికె మిథున్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదు ప్రతిని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు పంపారు. ఆదివారం శివమొగ్గలో హిందూ జాగరణ్ వేదికకు చెందిన దక్షిణ భారత సదస్సులో ప్రజ్ఞాసింగ్ పాల్గొన్నారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని చేపట్టి హత్యకు గురైన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష నివాసాన్ని కూడా ఆమె సందర్శించారు. సదస్సులో ప్రజ్ఞాసింగ్ ప్రసంగిస్తూ మైనారిటీ మతస్తులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారని, వారిని కించపరిచే విధంగా ప్రసంగించారని పూనావాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

లవ్ జిహాద్‌కు అదే స్థాయిలో తగిన విధంగా సమాధానం చెప్పాలని ప్రజ్ఞాసింగ్ హిందూ మతస్తులకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. తమ ఆడ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంట్లో ఆయుధాలు ఉంచుకోవాలని ఆమె హిందువులకు ఇచ్చిన పిలుపును ఆయన ప్రస్తావించారు. స్వీయ రక్షణ కోసం ఇంట్లో కనీసం కూరగాయలు కోసే కత్తినైనా ఉంచుకోవాలని కూడా ఆమె పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మైనారిటీలకు వ్యతిరేకంగా ఆయుధాలు ఉపయోగించాలని ఆమె బహిరంగంగా పిలుపు ఇచ్చారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ప్రసంగం ఒక మతం పట్ల విద్వేషపూరితంగా, హింసను ప్రేరేపించే విధంగా ఉందని, ఇది నేరమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News