Monday, May 13, 2024

రుణ దాతలకు షరతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక సంస్థలు రుణాలిచ్చే సమయంలో షరతులు విధించడం సర్వసాధారణమని, కానీ రుణాలు తీసుకునే వారు షరతులు విధించడం సరికొత్త రికార్డని, అలాంటి రికార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రుణాల రూపంలో నిధులను సేకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే షరతులు విధించడం ఆర్థ్ధికశాఖ వర్గాల్లోనే కాకుండా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇం డియా (ఆర్‌బిఐ)లో కూడా హాట్ టాపిక్‌గా మారిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఇప్పటి వరకూ దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఎక్కువ ని ధులను తక్కువ కాలపరిమితితోనే రుణాలుగా తీసుకొంటున్నాయని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం తక్కువ నిధులకు కూడా ఏకంగా 25ఏళ్ల కాలపరిమితి నుంచి 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్లకు కాలపరిమితి షరతులకు లోబడితే నిధులిచ్చే సంస్థల నుంచి మాత్రమే రుణాలు తీసుకొంటామని షరతును విధించడం ప్రస్తుతం ఆర్‌బిఐలో హా ట్‌టాపిక్‌గా మారిందని ఆర్థ్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

కేవలం “రుణాల రూపంలో నిధులిస్తే చాలు… కాలపరిమితి ఎంతైనా ఫర్వాలేదనే” ధోరణితో వ్యవహరించే రాష్ట్రాలే అధికంగా ఉన్నాయని, అస్సలు నిధులిస్తామంటే చాలూ ఎలాంటి షరతులకైనా రా ష్ట్రాలు న్న నేటి కాలంలో ఇలా రుణాలు తీసుకోవడానికి షరతులు విధించే ఏకైక రా ష్ట్రం తెలంగాణయేనని కొందరు ఆర్‌బిఐ అధికారులు అంటున్నారని వివరించారు. తాజాగా ఆర్‌బిఐ ప్రకటించిన సె క్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనే రాష్ట్రా ల్లో తెలంగాణ కూడా ఉందని, కేవలం రూ.వెయ్యి కోట్లకు ఏకంగా 25 ఏళ్ల కాలపరిమితిని విధించారని, మిగతా రా ష్ట్రాల కాలపరిమితి కేవలం పదేళ్లు, 12 ఏళ్లు, 20 ఏళ్లకు పరిమితమయ్యాయని వివరించారు. తెలంగాణతో పాటు ఒక్క కేరళ రాష్ట్రానికి మాత్రమే 25 ఏళ్ల కాలపరిమితి మంజూరైందని వివరించారు. డబుల్ ఇంజిన్ (బిజెపి పాలిత రాష్ట్రం) రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు రూ.2వేల కోట్ల రుణాలను ఏకంగా పదేళ్ల కాలపరిమితికి మాత్రమే ఆర్థ్ధిక సంస్థలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని ఆ అధికారులు వివరించారు.

అంతేగాక తమిళనాడు రాష్ట్రానికి కూడా రూ.2వేల కోట్లకు పదేళ్ల కాలపరిమితినే విధించారని తెలిపారు. దీనికితోడు నెలనెలా వడ్డీ చెల్లించే అవసరం లేకుండా ఆరు నెలలకు ఒకసారి మాత్రమే, అంటే ఏడాదికి రెండు సార్లు మాత్రమే వడ్డీలు చెల్లించే రుణాలు తీసుకుంటామని, అలాగైతేనే బాండ్ల వేలంలో పాల్గొంటామని తెలంగాణ రాష్ట్రం షరతు విధించడంతో విధిలేకనే ఈ నిబంధనలను అన్ని రాష్ట్రాలకూ వర్తింపజేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రతి ఏటా మే 3వ తేదీన తిరిగి నవంబర్ 3వ తేదీన మాత్రమే వడ్డీలు చెల్లించే విధంగా ఒప్పందాలు జరిగాయంటే అది తెలంగాణ ప్రభుత్వ చలవేనని ఆ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్‌బిఐ ముందుంచిన షరతులు మిగతా రాష్ట్రాలకు కూడా మేలు చేశాయని ఆ అధికారులు వివరించారు. మేనెల 2వ తేదీన ఆర్‌బిఐలో జరిగే సెక్యూరిటీ బాండ్ల వేలంలో 8 రాష్ట్రాలు పాల్గొంటున్నాయని, మొత్తం రూ.15,200 కోట్ల విలువైన బాండ్లకు వేలం జరుగుతుందని వివరించారు.

అందులో కేరళ రాష్ట్రానికి రూ.1500 కోట్లు, మణిపూర్‌కు రూ.200 కోట్లు, పంజాబ్ రాష్ట్రానికి రూ.3 వేల కోట్లు, రాజస్థాన్‌కు రూ.2,500 కోట్లు, తమిళనాడుకు రూ.2000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.2000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.3000 కోట్ల రుణాల కోసం బాండ్ల వేలం జరుగనుంది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లనైనా రుణాలుగా ఇస్తామని ఆర్థ్ధిక సంస్థలు ముందుకు వస్తున్నాయని, అంతేగాక కాలపరిమితిని కూడా ఎంత అడిగితే అంతకు అంగీకరించేందుకు కూడా ఆయా సంస్థలు, కొందరు వ్యక్తులు కూడా ఆర్‌బిఐని సంప్రదించారని కూడా ఆ అధికారులు వివరించారు. ఆర్థ్ధిక సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి రుణాలు ఇచ్చేందుకు ఎక్కువ ఆసక్తిని చూపడానికి బలమైన కారణాలే ఉన్నాయని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, ఐటి, ఫార్మా రంగాలను అభివృద్ధి చేయడం, కుల వృత్తులను ప్రోత్సహించడం, రైతుబంధు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండడం, దళితబంధు, ఆసరా పెన్షన్లు వంటి అనేక రకాల పథకాలతో మారుమూలనున్న పల్లెల్లో కూడా ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్థ్ధిక కార్యకలాపాలు) పెంపొందించడం మూలంగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయం కూడా రికార్డుస్థాయిలో ఉండటంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయనే విషయం ఆర్థ్ధిక స్పష్టంగా తెలుసునని, అందుకే రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాజకీయపరమైన కారణాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థ్ధికంగా దెబ్బకొట్టడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పుడు దేశం మొత్తానికి తెలుసునని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా తలవంచకుండా పథకాలన్నింటినీ విజయవంతంగా అమలు చేస్తుండటాన్ని పరిశీలించన ఆయా ఆర్ధిక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం విధించే ఎలాంటి షరతులకైనా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆ అధికారులు వివరించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి కేవలం 4,16,332 కోట్లు ఉందని, బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 8 ఏళ్లల్లో ఏకంగా 13.27 లక్షల కోట్లకు పెరిగిందని, ఈ గణాంకాలే ఆర్థ్ధిక సంస్థలను విశేషంగా ఆకట్టుకొన్నాయని ఆ అధికారులు వివరించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా 3,17,115 లక్షల రూపాయలకు పెరిగిందని వివరించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని తలసరి ఆదాయాన్ని లెక్కిస్తే కేవలం 1,70,620 రూపాయలు మాత్రమే ఉందని తెలిపారు.

ఈ అర్ధగణాంకాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి చిహ్నాలని ఆర్థ్ధిక సంస్థలు గుర్తించాయి గనుకనే ఎంత తక్కువ వడ్డీకైనా, ఎంతటి దీర్ఘకాలిక కాలపరిమితులకైనా రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నాయని ఆ అధికారులు వివరించారు. దీనికితోడు ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, రాష్ట్ర అప్పులు కేవలం 23.8 శాతానికే పరిమితంగా ఉన్నాయని, వాస్తవానికి నెలకు రూ.5 వేల కోట్ల రూపాయల వరకూ తెలంగాణ ప్రభుత్వం రుణాలు తీసుకోవచ్చునని, ఆ లెక్కన ఏడాదికి రూ.60 వేల కోట్ల రూపాయలను రుణాలుగా నిధులను సమీకరించుకోవచ్చునని, కానీ ప్రభుత్వం ఆ పనిచేయకుండా కేవలం రెండు వేలు, మహా అయితే రూ.2,500 కోట్లకే పరిమితమవుతోందని ఆ అధికారులు వివరించారు.

అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం ఏకంగా 54 శాతం అప్పులు చేసిందని, అయినప్పటికీ ఆ రాష్ట్రం ప్రతినెలా రూ.4,500 కోట్లను అప్పుగా తీసుకుంటోందని, మిగతా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా 36 శాతం అప్పులు చేసి కూడా ప్రతినెలా రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు అప్పులు చేస్తున్నాయని, ఒకరకంగా ఆ రాష్ట్రాలన్నీ అప్పులతోనే ప్రభుత్వ పాలనను సాగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తోందని, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని గౌరవిస్తోందని, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని గౌరవించకుండా తుంగలో తొక్కుతోందని, ఆ చట్టాన్ని అతిక్రమించిన కేంద్రం తలకుమించి అప్పులు చేసిందని వివరించారు. తీసుకొన్న రుణాలను తిరిగి చెల్లించడంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, అదీగాక తెలంగాణ ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఐటి సంస్థలు, ఫార్మా కంపెనీలు కూడా నిజాయితీగా పన్నులు చెల్లిస్తుండడంతోనే ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు వస్తున్నాయని, ఈ రాబడులను పరిశీలించిన ఆర్ధిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాయని ఆ అధికారులు సగర్వంగా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News