దేశంలో గణనీయంగా పెరిగిన రికవరీ రేటు
పది రాష్ట్రాల్లో జాతీయ సగటుకన్నా ఎక్కువే
90 శాతంతో అగ్రస్థానంలో ఢిల్లీ..తర్వాతి స్థానాల్లో హర్యానా, తమిళనాడు
తెలంగాణలో 77.40 శాతం
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62,282 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో ఇంత మంది కోలుకోవడం ఇదే తొలిసారి. తాజా గణాంకాలతో దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21.5 లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది. గత కొన్ని రోజులుగా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో యాక్టివ్ కేసులకు, రికవరీలకు మధ్య అంతరం 14,66,918కి చేరుకున్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరో వైపు యాక్టివ్ కేసులు, మరణాల రేటు కూడా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.
గత జూన్ 17 నాటికి 52.8 శాతంగా ఉన్న రికవరీ రేటు జూలై 16 నాటికి 63.24 శాతానికి, ఇప్పుడు 74.30 శాతానికి పెరిగింది. కోలుకున్న వారి విషయంలో జాతీయ సగటు 74.30 శాతం కాగా పది రాష్ట్రాల్లో మాత్రం రికవరీ రేటు అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 90.10 శాతం ఉంది. హర్యానాలో 84.50 శాతం, తమిళనాడులో 83.50 శాతం, గుజరాత్లో 79.40 శాతం, తెలంగాణలో 77.40 శాతం, రాజస్థాన్లో 76.80 శాతం, పశ్చిమ బెంగాల్లో 76.50 శాతం, బీహార్లో 76.30 శాతం, మధ్యప్రదేశ్లో 75.80 శాతం రికవరీ రేటు ఉంది. 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా రికవరీ రేటు నమోదైనట్లు వెల్లడించింది.
Corona Recovery Rate Increasing in India