బీజింగ్: చైనాలో అతి వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ అంటువ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 490కి చేరిందని చైనా ఆరోగ్య అధికారులు బుధవారం ప్రకటించారు. మొత్తం 24,324 మందికి ఈ వైరస్ సోకినట్టు చైనాలోని 31 ప్రావిన్షియల్ స్థాయి ప్రాంతాల నుంచి సమాచారం అందిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. మంగళవారం నాడు 65 మంది మరణించారని, మృతులందరూ హుబెయి ప్రావిన్స్, దాని రాజధాని వుహాన్ వాసులేనని, ఇదే రోజు కొత్తగా 3,887 కరోనా కేసుల్ని నిర్ధారించామని హెల్త్ కమిషన్ తెలిపింది.
అలాగే మంగళవారం నాడు 431 మంది రోగులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోలుకున్న తర్వాత 262 మంది మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మొత్తంమీద 3,219 మంది పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. 23,260 కి ఈ వ్యాధి సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇలా ఉండగా ఇంతవరకు 692 మంది రోగుల్ని కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వివరించింది. 16 మంది విదేశీయులకు కరోనా వ్యాధి సోకిందని చైనా విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువా చునియింగ్ మీడియాకు చెప్పారు.
Coronavirus Death Toll Rises To 490 in China