Sunday, April 28, 2024

నేడు ఓట్ల లెక్కింపు…

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు
8.30 గంటలకు ఈవిఎంల లెక్కింపు ప్రారంభం
ఒక టేబుల్ వద్ద ఆరుగురు అధికారులు
కేంద్రంలోకి 14 మంది ఏజెంట్లకు అనుమతి
కేంద్ర పరిశీలకునికి తప్ప ఇతరులకు సెల్‌ఫోన్ నిషేధం
ముందుగా భద్రాచలం, చివరిగా శేరిలింగంపల్లి ఫలితం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నేడు ఉదయం 8 గంటలకు 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుళ్లు సిద్ధం చేశారు. ఈఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటి ఫలితం భద్రాచలం, చివరిగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఫలితం వెళ్లడయ్యే అవకాశ ఉంది. నియోజకవర్గానికి కేటాయించిన టేబుళ్ల వద్దకు ఎలక్షన్ సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులను గరిష్ఠంగా 14 మంది ఏజెంట్లను అనుమతిస్తారు. ఆ లెక్కింపు కేంద్రం పరిశీలకుడు మినహా మిగతా ఎవరికీ సెల్ ఫోన్ తీసుకు వచ్చే అధికారం లేదని ముందుగా ఈవీఎంలను పరిశీలిస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. సీల్ ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించుకునేందుకు ఆ టేబుల్ దగ్గర ఉన్న సిబ్బంది, ఏజెంట్లు ఈవీఎంను పరిశీలిస్తారు. ఈవీఎంల సీల్ పై ఏజెంట్లకు అనుమానం కలిగితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారి పైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14 మందికి మించకుండా ఏజెంట్లను అనుమతిస్తారు.

ఫారం-17సి లో నమోదు చేసిన ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. కౌంటింగ్ సిబ్బంది ఆ సంఖ్యను ఫారం 17 సి పార్ట్ 2 నోట్ చేసుకుని, దానిపై ఏజెంట్ల సంతకం తీసుకుంటారు. అనంతరం ఈవీఎంల సీల్ తొలగించి ఫలితాల బటన్ నొక్కుతారు. ఆ ఈవీఎంలో పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం తెలుస్తుంది. ఆ వివరాలను కౌంటింగ్ సిబ్బంది నోట్ చేస్తారు. ఆ సంఖ్యను ఏజెంట్లు అందరికీ చూపించి, వారు సంతృప్తి వ్యక్తం చేశాకే రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసి భద్రపరుస్తారు.

ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం:  సీఈవో
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతుందని తెలిపింది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలైతుందని ప్రతీ ఈవిఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుందని దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సిఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఈవిఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. లోపల, బయట సిసి కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టినట్లు లోపలికి వెళ్లడానికి, రావడానికి ఒకే దారి ఉంటుందని స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నియోజకవర్గానికి 14 చొప్పున టేబుల్స్, పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, పటాన్ చెరు నియోజకవర్గాలకు 20 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 500లకు పైగా కేంద్రాల్లో పోలింగ్ జరిగిన శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో టేబుల్ కు ఆరుగురు అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో సహా ఒక్కో టేబుల్ కు మొత్తం ఆరుగురు ఉంటారని వెల్లడించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News