Sunday, April 28, 2024

కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదయ్యాయి.ఈ కొత్త సబ్ వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జెఎన్.1 కేసులు యుకె, ఫ్రాన్స్, ఐస్‌ల్యాండ్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా ఈ సబ్ వేరియంట్ జెఎన్1 కేసు కేరళలో నిర్ధారితమైంది.దీంతో కేరళ వైద్య శాఖలో మరోసారి అందోళన మొదలైంది. ఈ నెల 8న కేరళలోనొ ఓ మహిళలోఈ వేరియంట్‌ను గుర్తించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి.

నవంబర్ 18న 79 ఏళ్ల వృద్ధురాలినుంచి వచ్చిన శాంపిల్‌ను ఆర్‌టిపిసిఆర్ పరీక్షకు పంపించగా పాజిటివ్‌గా ఫలితం వచ్చిందని, ఆమెకు ఇన్‌ఫ్లుయెంజా లాంటి స్వల్ప లక్షణాలు ఉన్నాయని, మెల్లగా కొవిడ్19నుంచి కోలుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు భారత్‌నుంచి సింగపూర్‌కు వెళ్లిన వ్యక్తిలో కూడా జెఎన్.1 సబ్ వేరియంట్‌ను గుర్తించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25న సింగపూర్ వెళ్లారు. అయితే ఆ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించిన తర్వాత తిరుచిరాపల్లి జిల్లాలో కానీ, తమిళనాడులో కానీ కేసుల సంఖ్య పెరిగినట్లుగా గుర్తించలేదు. ఇవి కాకుండా దేశంలో ఎక్కడా జెఎన్.1 వేరియంట్‌కు చెందిన కేసులు గుర్తించలేదని కూడా అధికార వర్గాలు తెలిపాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్( సిడిసి ) తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్ వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ.2.86 వంశానికి చెందినది. దీన్ని ‘ పిరాల’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం జెఎన్.1, బిఎ.2.86 మధ్య ప్రధానంగా ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రొటీన్‌లో మార్పు. స్పైక్ ప్రొటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరి కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే సిడిసి తెలిపిన వివరాల ప్రకారం ఈ వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు. అలాంటి పరిస్థితిలో దాని లక్షణాలు కొవిడ్19 ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం.అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చని అంటున్నారు.

జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం,జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌కు సంబంధించి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండడాన్ని గమనిస్తే మన రోగ నిరోధక వ్యవస్థనుంచి అది సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. అయితే ఇతర కరోనా వేరియంట్లకంటే జెఎన్.1 ప్రమాదకరమా, కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సిడిసి అంటోంది.అంతేకాదు, అభివృద్ధి చేసిన కొవిడ్19 వ్యాక్సీన్లు ఈ జెఎన్.1 వేరియంట్‌నుంచి రక్షణకు తోడ్పడతాయని కూడా సిడిసి అంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News