రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది
ఇప్పటి వరకు 15మందిని రక్షించాం
ఎవరూ ఆందోళన చెంద వద్దు
లోతట్టు ప్రాంతాల వారిని తరలించాం
వరద ప్రాంతాల్లో పర్యటించిన సిపి అంజనీకుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కుండపోత వర్షం కురవండతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. చాంద్రాయణగుట్ట పరిసరాల్లో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, జిహెచ్ఎంసి అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి బుధవారం ఆయన వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిపి అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వరదల్లో కొట్టుకుపోతున్న 15మందిని రక్షించామని తెలిపారు. ఇందులో డయాలిసిస్ మహిళ కూడా ఉందని అన్నారు. పోలీసులు రాత్రి వరకు రక్షణ చర్యల్లో పాల్గొని ఉదయమే మళ్లీ వచ్చారని తెలిపారు. ఎవరూ బయపడవద్దని అందరినీ రక్షిస్తామని అన్నారు. కొంతమందిని బోటు ద్వారా కూడా రక్షిస్తున్నామని, మూసి పక్కన ఉన్న వారిని అక్కడి నుంచి వసతి గృహాలకు తరలించామని తెలిపారు. పాత ఇళ్లు ఉన్న వారు మూడు అంతస్థుల భవనాలు ఉన్న వారు వసతి ఇవ్వాలని తెలిపారు. పోలీసులు రాత్రి నుంచి ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు.
వర్షాలకు ప్రాణాలు బలి…
నగరంలో కురిసిన భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో వర్షాలకు 15మంది మృతిచెందారు. పాతబస్తీలోని బార్కస్లో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే వ్యక్తి నీటిలో కొట్టుకుపోతున్న కాపాడలేని పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీలో యోగా క్లీనిక్ నడిపిస్తున్న డాక్టర్ సతీష్ రెడ్డి ఉదయం క్లీనిక్ తెరిచాడు. క్లీనిక్లో నీరు చేరడంతో మోటారు సాయంతో బయటికి పంపించేందుకు మోటార్ను ఆన్ చేయగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బండ్లగూడ మహ్మదీయా నగర్లోని ఓ పహిల్వాన్కు చెందిన ఫామ్హౌస్ గ్రానైట్ గోడ కూలి పక్కనేఉన్న రెండిళ్లపై పడడంతో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంగా రెండు కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోగా ఒకరి మృతదేహం లభించగా, మరొకరిది ఇప్పటి వరకు లభించలేదు.
లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలిః విసి సజ్జనార్
నగరంలో కురిసిన భారీ వర్షాల వల్ల రాజేంద్రనగర్ డివిజన్ పల్లె చెరువు కట్టతెగి నీరు భారీగా ప్రవహిస్తోందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. చెరువును సిపి సజ్జనార్ సందర్శించారు. చెరువులో నుంచి నీరు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లల్లోకి నీరు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. వెంటనే వారు ఇళ్లను ఖాళీ చేసి వసతి గృహాలకు వెళ్లాలని సూచించారు. గురువారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటికి రావద్దని కోరారు. జిహెచ్ఎంసి, జిల్లా యంత్రాంగం కొన్ని ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని తెలిపారు.
బాలాపూర్లో రాచకొండ సిపి…
వరద ప్రాంతాలైన బాలాపూర్ ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డితో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యటించారు. నలుగురు పేషెంట్లను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. పెద్ద అంబర్పేటలో వరదలో లారీ కొట్టుకుపోతుండగా డ్రైవర్ రాంరెడ్డిని రక్షించారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉన్న వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సిపి మహేష్ భగవత్ కోరారు.
CP Anjani Kumar Inspects flood affected areas in Hyd