హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 10 వేల 610 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పటికే అగ్గి తెగులుతో వరి పంటకు నష్టం వాటిల్లుతుండగా, తాజాగా అకాల వర్షాలతో దాదాపు మూడు వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పంట 7285 ఎకరాల్లో, జొన్న 500 ఎకరాల్లో నష్టపోయింది. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 5267 ఎకరాలు, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 1220 ఎకరాల్లో మొక్కజొన్న నష్టం జరిగింది. నల్లగొండ జిల్లాలో 2410 ఎకరాల్లో వరి నీట మునిగింది. పొట్ట దశకు చేరుకుంటున్న సమయంలో వర్షాలు కురవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం పది జిల్లాలోని 39 మండలాల్లోని 165 గ్రామాల్లో 7227 మంది రైతులు అకాల వర్షాలకు నష్టపోయినట్లు నివేదికలో వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.