రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన ఆర్సిపురం పోలీసులు
పోలీసులను అభినందించిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
మన తెలంగాణ/రామచంద్రాపురం: పోలీసులు సకాలంలో స్పందించడం ఒక నిండు ప్రాణం నిలిచింది. రోడ్డు పక్కన అనుమానస్పదంగా నిలిపి ఉన్న బైక్ను అనుసరించిన పోలీసులకు రైలు పట్టాలపై ఆత్మహత్యకు సిద్దమైన వ్యక్తి కనిపించడంతో…సత్వరమే స్పందించి రక్షించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్థానిక పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఆర్సిపురం పోలీస్ స్టేషన్కి చెందిన బ్లూకోట్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇక్రిసాట్ పక్కన గల సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బైక్ పార్క్ చేయడం కనిపించింది. వెంటనే స్పందించిన బ్లూకోట్ పోలీసులు సమీపంలోని నడక దారి గుండా వెళ్లగా రైల్వే ట్రాక్పై పడుకుని ఉన్న వ్యక్తిని గమనించారు. అప్పటికే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండటం గమనించారు. ఈ విషయాన్ని ఎస్హెచ్ఒ రమేశ్ కుమార్కి సమాచారం అందించి, వ్యక్తి వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి, అప్పగించారు. ఆర్థిక సమస్యల మూలంగానే తన భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. సకాలంలో స్పందించి బీట్ కానిస్టేబుల్స్ ముత్యాలు, హోంగార్డు అహ్మద్లను ఎస్హెచ్ఒ రమేశ్ కుమార్తో పాలు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో పోలీసులపై ఉన్న నమ్మకం మరింత రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.