Thursday, May 2, 2024

16.8 కోట్ల మంది డేటా దొంగిలించిన ముఠా అరెస్టు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని 16.8 కోట్ల మంది పౌరుల రహస్య వ్యక్తిగత డేటా, ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థల సున్నితమైన డేటాను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. నోయిడా, పూణే నుంచి దొంగతనం, సున్నితమైన, రహస్య డేటాను సేకరించి విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా రక్షణ, సైనిక సిబ్బందికి సంబంధించిన కీలక డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. డేటా చోరీ కేసులో తదుపరి విచారణ కోసం హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామన్నారు. నిందితులు రక్షణ సిబ్బంది, బ్యాంకు కస్టమర్లు, ఇంధన రంగ వినియోగదారులు, నీట్ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్యాస్ ఏజెన్సీలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు(హై నెట్‌వర్త్ ఇండివిజ్యూవల్స్), డీమ్యాట్ హోల్డర్లు సహా 140 కేటగిరీల వ్యక్తుల సమచారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు.ఇతర కేటగిరీలలో బెంగళూరు మహిళా వినియోగదారుల డేటా, రుణాలు, బీమా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల డేటా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు హోల్డర్‌లు(యాక్సిస్, హెచ్‌ఎస్‌బిసి, ఇతర బ్యాంకులు), వాట్సాప్ వినియోగదారులు, ఫేస్‌బుక్ వినియోగదారులు, ఐటి కంపెనీల ఉద్యోగులు, తరచూ ప్రయాణించే వారు ఉన్నారు.

నమోదైన, నమోదు కాని కంపెనీలైన డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్, ఎంఎస్ డిజిటల్ గ్రో ద్వారా ఓ ముఠా ఆపరేట్ చేస్తోన్నట్లు ఆరోపణ. 2.5 లక్షల మంది రక్షణ సిబ్బందికి చెందిన వారి ర్యాంకులు, ఈమెయిల్ ఐడీలు, పోస్టింగ్ స్థలం మొదలైన వాటితో కూడిన సున్నితమైన డేటా నిందితుల వద్ద లభ్యమైంది. ఆరు బ్యాంకులకు చెందిన 1.1 కోట్ల మంది ఖాతాదారులు, 1.2 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు, 17 లక్షల మంది ఫేస్‌బుక్ వినియోగదారులు, ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన 35000 మంది ఉద్యోగుల డేటాను ఈ మోసగాళ్లు యాక్సెస్ చేశారు. నిందితులు క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 98 లక్షల మంది డేటాను కూడా యాక్సెస్ చేశారు.

ప్రధాన నిందితుడు కుమార్ నితీశ్ భూషణ్ తమ కాల్ సెంటర్ నోయిడాలో ఉందని, క్రెడిట్ కార్డు డేటాబేసెస్‌ను ముస్కాన్ హసన్ నుంచి సేకరిస్తామని తెలిపాడు. కాగా భూషణ్ కాల్ సెంటర్‌లో పూజా పాల్, సుశీల్ థోమర్ టెలీకాలర్‌లుగా పనిచేస్తున్నారు. ఇదిలావుండగా అతుల్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డు హోల్డర్ల డేటాను సేకరించి తన కంపెనీ ‘ఇన్‌స్పయిరీ డిజిటల్ ’ద్వారా లాభాధారంగా అమ్ముకుంటాడు.

ముస్కాన్ గతంలో అతుల్ కార్యాలయంలో పనిచేసింది. తర్వాత తన కంపెనీ ‘ఎంఎస్ డిజిటల్ గ్రో ’ ఏర్పాటు చేసింది. ఆమె మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డేటాను అమ్ముకుంటుంది. ఆమె అతుల్ నుంచి డేటాను తీసుకుని భూషణ్‌కు అమ్మేది. ఇక సందీప్ పాల్ ‘గ్లోబల్ డేటా ఆర్ట్’ను ఏర్పాటుచేసి జస్ట్ డయల్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను ఉపయోగించి మోసగాళ్లకు కాన్ఫిడెన్షియల్ డేటాను అమ్ముతూ సైబర్ అఫెన్సెస్‌కు పాల్పడ్డాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News