మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ దీనిపైనే దృష్టి పెట్టాయి. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హుజురాబాద్ నియోజకవర్గ పిసిసి ఇంఛార్జిగా దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఆ స్థానం ఉప ఎన్నికల కోఆర్డినేటర్లుగా జీవన్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు కొనసాగుతారని ప్రకటించింది. అక్కడి మండలాలు, మునిసిపాలిటీలలోనూ పార్టీ బలోపేతానికి ఇంఛార్జిలను నియమించింది. వీణవంకకు ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్ ఇంఛార్జిలుగా కొనసాగుతారు.
అలాగే, జమ్మికుంటకు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జమ్మికుంట మునిసిపాలిటీకి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్యను ఇంఛార్జిలుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి నియమించారు. హుజురాబాద్కు తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆ ప్రాంత మునిసిపాలిటీ పరిధికి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు, ఇల్లందుకుంటకు నాయిని రాజేందర్రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కమలాపూర్కు కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య ఇంఛార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Damodar Raja Narasimha appoints as Huzurabad PCC In Charge