ప్లాస్మాథెరఫీకి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరిన విర్కో బయోటెక్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్సపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్రంలో కొవిడ్ పేషెంట్లకు ఫ్లాస్మాథెరఫీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విర్కో బయోటెక్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను కోరారు. మొదటి మూడు నెలలు ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని వారు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్మాథెరఫీ చికిత్సతో కొవిడ్ రోగులు కోలుకుంటున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు. ఈక్రమంలోనే చికిత్స కొరకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని ఆయన వెల్లడించారు.
బయోటెక్ సంస్థ డైరెక్టర్ డా రాజేశ్ తుమ్మూరు మాట్లాడుతూ..కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయట పడవేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని మంత్రికి తెలిపారు. వ్యాక్సిన్ వస్తేనే దీనిని పూర్తి స్థాయిలో నివారించగలమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కరోనా వైరస్కి చికిత్స లేదు, కేవలం లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స అందిస్తున్నాం కావున ఈ తరుణం లో ప్లాస్మా థెరఫీ ద్వారా చికిత్స సాధ్యమని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. కోవిడ్-19 చికిత్స కి ప్లాస్మా థెరపీ, ఇమ్మునో గోబ్లిన్ అందించడం ద్వారా చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం సంప్రదించిన మొదటి కంపెనీ తమదేనని మంత్రి కి తెలిపారు. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ అనుమతి కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మొదటి మూడు నెలలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని డా రాజేశ్ హామీ ఇచ్చారు.