Sunday, April 28, 2024

రాజకీయాలు కాదు అభివృద్ధే ముఖ్యం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 3 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి జనార్ధన్ రెడ్డిని వివిధ ముస్లిం సంఘాల పెద్దలు ఘనంగా సత్కరించి కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ముఖ్యం కాదని, ఈ ప్రాంతానికి ప్రతినిధిగా ఉండి ఏమి చేశారన్నదే ముఖ్యమన్నారు. నాగర్‌కర్నూల్‌లో నా హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో కళ్లముందే ఉందన్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా ఏర్పాటు నుండి మెడికల్ కళాశాల ఏర్పాటు, జిల్లా కలెక్టర్, పోలీస్ శాఖ, సమీకృత కార్యాలయాలు హైదరాబాద్‌కు తీసిపోని విధంగా ట్యాంక్ బండ్ , బుద్ధుడి విగ్రహం, అడుగడుగున ప్రతి వీధికి సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు. దీనికి తోడు అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల ఈ ప్రాంతానికి ఒక కలికితు రాయి అని చెప్పవచ్చన్నారు. ఉయ్యలవాడ నుండి బస్ డిపో వరకు ప్రధాన రహదారిపై డివైడర్ నిర్మాణం ద్వారా ప్రయాణికులకు సౌకర్యమే కాకుండా పట్టణానికి ఒక అందం అన్నారు. ఈ ప్రాంతానికి ఒక ఇంజీరింగ్ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాలను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని, మీ ఆశీర్వాదంతో సాధిస్తానన్నారు.

హజ్ హౌస్, షాదీ ఖానా నిర్మాణాలు చేపట్టే బాధ్యత పూర్తిగా నాపై వదిలి పెట్టాలన్నారు. పెద్ద కాంట్రాక్టర్లను రప్పించి ఈ పనులు పూర్తి చేయిస్తానని ఆయన హామి ఇచ్చారు. అదే విధంగా ఖబ్రస్తాన్ కోసం మరో ఐదు ఎకరాలు స్థలాన్ని సమీకరించి అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వక్ఫ్ కాంప్లెక్స్ స్థలంలో నిరుపేదల కోసం ఆటో నగర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ముస్లిం పెద్దల సహకారం అవసరమన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. నిరుపేద ముస్లింల విద్య కోసం పెద్దపీట వేస్తూ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.

కలిసికట్టుగా ఉంటే అభివృద్ధికి సహకరిస్తే అందరి సంక్షేమం జరుగుతుందన్నారు. ముస్లింలకు ప్రభుత్వం అందించే పథకాలలో భాగస్వాములను చేస్తూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అభివృద్దికి చేయూత అందిస్తుందన్నారు. మీ సహకారం నాకు ఎల్లప్పుడు ఉండాలని, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. రాజకీయాలలో 40 ఏళ్లుగా అనేక మంది వచ్చారని వారు చేసిన అభివృద్ధి ఏమిటో, తొమ్మిదేళ్లలో నేను చేసిన అభివృద్ధి ఏమిటో మీ కళ్లముందర ఉందన్నారు. నాగర్‌కర్నూల్‌ను మరింత అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి హామి ఇచ్చారు.ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ ఇప్పటి వరకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ముస్లింలకు చేసిన అభివృద్ధిని వివరించారు.

భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అన్ని పనులు చేస్తానని హామి ఇచ్చారు. మరో 50 లక్షల రూపాయలతో మీరు కోరిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని, ఇందుకు పూర్తి బాధ్యత నాదేనని మర్రి జనార్ధన్ రెడ్డి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం అడ్వైజరీ కమిటీ బాధ్యులు షేఖ్ యాకూబ్ బావజీర్, మొహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా హజ్ సొసైటి అధ్యక్షుడు షేఖ్ ఫరీద్ అహ్మద్, సభ్యులు శుకూర్, వక్ఫ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ కమిటీ కార్యదర్శి అబ్దుల్లా, మదరస ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూమ్ కమిటీ కార్యదర్శి సయ్యద్ రఫీ యొద్దిన్, సభ్యులు అబ్దుల్ అలీమ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ముస్తాక్ అహ్మద్, కౌన్సిలర్ ఇస్తాక్ మియ్యలతో పాటు వివిధ మస్జీద్ కమిటీల బాధ్యులు, ముస్లిం సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News