Friday, May 10, 2024

పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ధర్నా

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుల భాస్కర్, ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ పేదలకు వంద గజాల జాగా ఇవ్వలేని ప్రభుత్వం బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ వాగ్ధానాన్ని విస్మరించారని అన్నారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనాల జీవోను సవరించి కార్మికులకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న హత్యలు, హత్యాచారాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు డీఆర్‌ఓ లింగ్యానాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యర్శులు అశోక్, చంద్రశేఖర్, ఐద్వా నాయకులు వినోద, మంగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News