నూతన మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలకు భారతదేశ రాజముద్రని తప్పని సరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రాజముద్రలో తప్పనిసరిగా ‘సత్యమేవ జయతే’ని వాడాలని తెలిపింది. అదికూడా దేవనాగరి లిపిలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. రాజముద్రను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అధికారం ప్రభుత్వ సంస్థలకు ఉందని, దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే నినాదంతో కూడిన రాష్ట్ర చిహ్నాన్ని చిత్రీకరించాలని ప్రభుత్వం సూచించింది. ‘సత్యమేవ జయతే’ లేకుండా రాజముద్రను వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. పూర్తి వివరాలను భారత ప్రభుత్వ వెబ్సైట్ http://www.mha.gov.in లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.