Sunday, April 28, 2024

రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తారా?

- Advertisement -
- Advertisement -

Drillmec SpA to set up manufacturing hub in Hyderabad

రిగ్గుల తయారీ పరిశ్రమకు ఎంవోయు

నినాదాలతో మేకిన్‌ఇండియా సాధ్యమా?
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా మోడీ సర్కార్‌పై పోరాటం తప్పదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. నేడు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ సారైనా తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని విభజన చట్టంలో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం నినాదంతో మేకిన్ ఇండియా సాకారం సాధ్యంకాదన్నారు. అందుకు తగిన సంస్కరణలు, విధానాలు, మౌలికవసతులు తీసుకురావాలని కేంద్రానికి మంత్రి కెటిఆర్ సూచించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కుగా వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కుకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్ ఫార్మాసిటీలో ఏర్పాటుచేయబోతున్నామన్నారు. కేంద్రం నుంచి వీటికి సాయంకోరినా స్పందన రాలేదన్నారు. కొత్తగా ఆరు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటుచేయాలని కోరామన్నారు.

అది కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైద్దాంతిక, రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రంపై వివక్ష చూపితే సంక్షోభం తలెత్తుతుందన్నారు. ఫలితంగా దేశంలో పారిశ్రామికీకరణకు, ఉద్యోగ కల్పనకు, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రతిసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందోనని ఎంతో ఆశగా ఎదురు చూడడం…కానీ కేంద్రం నుంచి ఎటువంటి ప్రాధాన్యత లభించకపోవడం అనాయితీగా మారిందన్నారు. ఈ పరిస్థిటి నేటి బడ్జెట్‌లో పునరావృతం అయితే మాత్రం ఇక కేంద్రానికి చుక్కులు చూపిస్తామన్నారు. కేంద్రంపై అసలు….సిసలైన పోరాటం టిఆర్‌ఎస్ పార్టీ మొదలుపెడుతుందన్నారు.

ఇటలీకి చెందిన డ్రిల్‌మెక్ స్పా సంస్థ హైదరాబాద్ కేంద్రంగా సుమారు రూ.1500(200 మిలియన్ యుఎస్ డాలర్లు) కోట్లతో కార్యకలాపాలను చేపట్టేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఏడున్నరేళ్ల కాలంలో రాష్ట్రం వివిధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిందన్నారు. ఇలాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరింత చేయూతనివ్వాల్సిన కేంద్రం అందుకు విరుద్దంగా వ్యవహస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్ధిక రంగానికి చేయూతనందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు కేంద్రం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే పారిశ్రామికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.

కేంద్రం నుంచి సహకరం లభిస్తే…. ఇక్కడి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నరేంద్రమోడీ పదేపదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ గురించి మాట్లాడుతారని…కానీ కేంద్రం నుంచి ఆ విధంగా రాష్ట్రాలకు చేయుత అందడం లేదని మంత్రి కెసిఆర్ విమర్శించారు. ఇలా అయితే సబకా వికాస్ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం ఎంతో అవసరమన్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా, రాష్ట్ర హక్కులు… డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామనని మరోసారి కెటిఆర్ స్పష్టం చేశారు.

కెసిఆర్ అద్భుత పాలనకు నిదర్శనం

ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని… హైదరాబాద్‌లో డ్రిలెమెక్‌స్పా సంస్థ తమ యూనిట్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జనరంజక పాలనకు నిదర్శనమన్నారు. టిఎస్…ఐపాస్ చట్టం ద్వారా పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం పరుగులు తీసుస్తోందన్నారు. డ్రిల్‌మెక్ స్పా కంపెనీ కేవలం ఆయిల్ రిగ్గులను తయారు చేసే సంస్థ అని…. కానీ తెలంగాణలో సముద్రం తీరం లేదు, ఆయిల్ రిజర్వులు కూడా లేవన్నారు. అలాగే సదరు సంస్థకు రాష్ట్రంలో ప్రత్యక్ష వినియోగదారులు కూడా లేరన్నారు. అయినప్పటికీ ఇటలీ, యుఎస్ వంటి దేశాలను కాదని భారతదేశంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం….అందులోనూ దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందినా హైదరాబాద్‌ను ఎంచుకోవడం సిఎం కెసిఆర్ పాలనకు నిదర్శనం కాదా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు రక్షణ, మెరుగైన శాంతిభద్రతలు, సుస్థిర పాలన, సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసే పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

డ్రిల్‌మెక్ స్పా సంస్థ ఏర్పాటు చేస్తున్న రిగ్గుల తయారీ కంపెనీలో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 2500 మందికి ఉపాధి దక్కనుందన్నారు. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంపూర్ణ…సహకారం అందిస్తామన్నారు. అంతకుముందు డ్రిల్‌మెక్ స్పా ప్రతినిధి సియోన్ ట్రెవిసాని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమన్నారు. ఈ తయారీ యూనిట్ దేశంలో ఇంధన భద్రతకు భరోసా ఇస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ తయారీ కేంద్రం వల్ల సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News