Sunday, April 28, 2024

సర్పంచులకే తాగునీటి విధులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికి నీళ్లు ఇవ్వటమే కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ లాంటి కొత్తగా రిజర్వాయర్ల అన్నింటిని తాగునీటికి వాడుకోవాలని పేర్కొన్నారు.

మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని, ఇంటింటికి నీళ్ల ను అందించే బాధ్యతను వారికే ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు.
గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల నిర్వహణ మాత్రమే విడిగా సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్, ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. గ్రా మాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలో లేద ని అధికారులు వివరణ ఇవ్వగా, జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందన్నారు.

నూటికి నూరు శాతం తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో నష్టమే తప్ప లాభం లేకుండా పోయిందని దీంతో కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు వీలున్న జల జీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికి రా ష్ట్రంలో చాలా చోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తండాలు, గూడెలు, అటవీ గ్రామాలకు నీళ్లు అందటం లేదన్నారు. ఎన్నికలప్పుడు తాను ఖానాపూర్‌కు వెళితే తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు చాలా గ్రామాల ప్రజలు తన దృష్టికి తెచ్చిన విషయం గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని హాబిటేషన్లకు తాగునీరు అందటం లేదో సమగ్రంగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవికాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని హాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మి షన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు.

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఇప్పటి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీ టిని ప్రజల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యం గా అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న స్వ యం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్‌లు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికి రోడ్డు కనెక్టివిటి లేని గ్రామాలు, హాబిటేషన్లకు రోడ్లను నిర్మించాలని, 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు నేటికి రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించారు. వీటన్నింటికీ తారు రోడ్లు వేయాలని, అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి వీటిని పూర్తి చేయాలని చెప్పారు.

ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News