Sunday, May 5, 2024

ఆధారాలు సమర్పించమని అఖిలేశ్ యాదవ్‌కు ఈసి ఉత్తర్వు

- Advertisement -
- Advertisement -

Akilesh Yadav

న్యూఢిల్లీ: బిజెపి ప్రోద్బలంతో దాదాపు 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మంది ముస్లిం, యాదవ్ ఓట్లను తొలగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గత నెల తమ పార్టీ జాతీయ సదస్సులో ఆరోపించారు. అందువల్లే తాము ఓడిపోయినట్లు ఎకరువు పెట్టారు. కాగా దీనిపై ఎన్నికల సంఘం(ఈసి) గురువారం ఆయనకో తాకీదును జారీ చేసింది. నవంబర్ 10లోగా ఆయన చేసిన ఆరోపణలకు రుజువులు సమర్పించాలంది. కాగా అఖిలేశ్ యాదవ్ ఈసి దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు దాఖలు చేయలేదు. కానీ ఆయన చేసిన ఆరోపణలను ఈసి సీరియస్‌గా తీసుకుంది. ఇది ఎన్నికల విధానానికి, ప్రజాస్వామ్య విధానానికి భంగం కలిగించే ఆరోపణ అని పేర్కొంది. కాగా అఖిలేశ్ యాదవ్‌కు జారీచేసిన తాకీదు బహిరంగ అందుబాటులోనైతే ప్రస్తుతం లేదు.

ఏ ఓటరు పేరు తొలగించింది అసెంబ్లీ పరమైన డేటా, తప్పుగా తొలగించిన వారి పేరు, దానికి రుజువు/దస్తావేజులు, పార్టీ అధికారులు దాఖలుచేసిన ఫిర్యాదు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల జాబితా నుంచి తొలగించిన విషయంపై రుజువులు సమర్పించాలని ఈసి తాకీదు జారీ చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక్క అధికారి కూడా ఫిర్యాదు దాఖలు చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. కాకపోతే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అభ్యర్థి మాత్రం అలీగంజ్‌లో 10వేల ఓటర్లపేరు(మైనారిటీ, షెడ్యూల్డ్ క్యాస్ట్) తొలగించినట్లు ఫిర్యాదు చేశారు. అయితే అది సత్యదూరం అని తేలింది.

ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించే వీలు లేకుండా కొన్ని నియమాలను అధికారులకు నిర్దేశించారు. సుమోటో(తమంత తాము) పేర్లను తొలగించకుండా నియమం విధించారు. పైగా తొలగించే వారి పేర్లను వారికి ముందుగానే తెలుపాల్సి ఉంటుంది. ఓటర్లలో 0.1 శాతం ఓటర్ల పేర్లను తొలగించినా స్థానిక ఎన్నికల అధికారులు ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలుపాల్సి ఉంటుంది. ఇన్ని నియమాలున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యపై అఖిలేశ్ యాదవ్ ఇంకా ప్రతిస్పందించాల్సి ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపిని ఎదుర్కొనే శక్తి తమ పార్టీకి మాత్రమే ఉందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బిజెపి అధికార దుర్వినియోగం చేయడం వల్లే తమ పార్టీ 2022 ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. అంతేకాక అంబేద్కర్, లోహియా అనుయాయులు ఒక్కటై బిజెపిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించడంలో బిజెపితో ఈసి చేతులు కలిపిందని కూడా అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆయన తన ఆరోపణలను సెప్టెంబర్ 29నాటి ప్రసంగంలో చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News