Sunday, April 28, 2024

యంగ్ ఇండియా లిమిటెడ్ ఆఫీసుకు సీల్

- Advertisement -
- Advertisement -

ED seals premises of Young Indian company

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి తాకిడి
సోనియా నివాసం వద్ద భారీగా బలగాలు
కాంగ్రెస్ కార్యాలయం రోడ్డు దిగ్బంధం
మోడీ రాజకీయ కక్ష సాధింపు
నిరసనకు దిగిన కాంగ్రెస్
సహకరించనందుకే చర్య
ఇడి అధికారుల వివరణ

న్యూఢిల్లీ : ఇక్కడి బహద్దూర్ షా జాఫర్ మార్గ్‌లోని యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) కార్యాలయానికి బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు సీల్ వేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయం అయిన హెరాల్డ్ భవన్‌లోనే వైఐఎల్ ఆఫీసు ఉంది. హెరాల్డ్‌భవన్ కాంగ్రెస్ పార్టీ యాజమాన్యంలోనే ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వాహక బాధ్యతలలో ఉంటూ వచ్చిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)ను వైఐఎల్ చాలా కాలం క్రితమే అధీనంలోకి తీసుకుంది. ఈ విధంగా నేషనల్ హెరాల్డ్ నిర్వాహక సంస్థ కార్యాలయానికి ఇడి తాళాలు వేయడం, సీల్ చేయడం కీలక పరిణామం అయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇడి విచారిస్తున్న దశలో హెరాల్డ్‌భవన్‌లో ఒక్కరోజు క్రితం ఇడి బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. బుధవారం ఇక్కడ వైఐఎల్ కార్యాలయానికి సీల్, ఇదే దశలో సోనియా గాంధీ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాల మొహరింపు, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే దారిలో బారికేడ్లు వంటి ఘటనలతో పరిసర ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది.

ఇప్పుడు ఇడి సాగిస్తున్న దాడులు , సీల్ వేయడాలు ఇవన్నీ కూడా దేశ ప్రధాన ప్రతిపక్ష అయిన భారత జాతీయ కాంగ్రెస్‌పై నిరంతర దాడి ప్రక్రియలో భాగం అని, ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎంపి జైరామ్ రమేష్ ట్వీటు వెలువరించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఈ విధమైన రాజకీయ కక్ష సాధింపులకు దిగడం గర్హనీయం అని తెలిపారు. నిరసనలకు దిగే తమను నివారించలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే దారులను దిగ్బంధించడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది. ఈ అసాధారణ స్థాయికి ఢిల్లీ పోలీసులు ఎందుకు దిగుతున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

సాక్షాల పరిరక్షణకే సీల్ : ఇడి వర్గాలు

అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకునే కార్యాలయం సీల్ చేశామని , మనీలాండరింగ్ కేసు విచారణల దశలో వెలువడ్డ సాక్షాలను పదిలపర్చుకోవడానికి , ఇవి తారుమారుకాకుండా చేసుకునేందుకు వెంటనే కార్యాలయానికి సీల్ వేయడం జరిగిందని ఇడి అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం నాటి సోదాల దశలో కార్యాలయ అధికారిక ప్రతినిధులు అందుబాటులో లేరని , సాక్షాల పరిరక్షణకు ఇప్పుడు ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని ఇడి తెలిపింది. కేవలం యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయానికి సీల్ వేశారని, మిగిలిన నేషనల్ హెరాల్డ్ కార్యాలయం తెరిచే ఉందని, దీనిపై ఎటువంటి చర్యకు దిగలేదని ఇడి వర్గాలు వివరించాయి. సోదాలు దాడుల నిర్వహణకు ఈ ఆఫీసు ప్రధాన నిర్వాహక అధికారులకు ముందుగా ఇ మొయిల్ సందేశాలు వెలువరించామని, అయితే వారి నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో సీల్ వేయాల్సి వచ్చిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News