మాజీ సిఎస్ ఎస్వి ప్రసాద్ మృతి
సుప్రీం సిజె, ఉపరాష్ట్రపతి, సిఎంలు కెసిఆర్, జగన్ల సంతాపం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా బారిన పడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ మృతి మంగళవారం ఉదయం మృతి చెందారు. గత 10 రోజుల కిందట ఎస్వి ప్రసాద్తో పాటు ఆయన కుటుంబం మొత్తం మహమ్మారి బారినపడింది. దీంతో వారంతా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రసాద్ పెద్ద కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఎస్వి ప్రసాద్ మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ప్రసాద్ భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్వి ప్రసాద్ ఐఐఎం అహమ్మదాబాద్లో ఎంబిఎ పూర్తి చేసిన అనంతరం 1975 ఐఏఎస్ సాధించారు. నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గా ఎస్వీ ప్రసాద్ తన కెరిర్ ని ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖ జిల్లాల కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు,రోశయ్యల వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్గా పనిచేశారు.
ప్రముఖుల సంతాపం
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగురాష్ట్రాల సిఎంలు కెసిఆర్, జగన్లు సంతాపంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్విప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల గవర్నర్లు దత్తాత్రేయ, విశ్వభూషణ్, సినీ నటుడు చిరంజీవి తదితరులు సంతాపం తెలిపారు.
Ex CS S V Prasad passed away