మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఇ-ఓటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి. పార్థసారధి తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో నమోదై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, కోవిడ్-19 వలన క్వారంటైన్లో ఉన్న ఓటర్లు, వయో వృద్ధులకు ఇ-ఓటింగ్ ద్వారా ఓటు హక్కు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందరిలో ఇ-ఓటింగ్ విధానం అమలుపై ఉన్న సాంకేతిక అంశాలను, ఓటు వేయడానికి రిజిస్టర్ చేసుకునే విధానంపై సంబంధిత అధికారులతో పార్థసారధి చర్చించారు. అలాగే ఓటింగ్ గోప్యత నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్లో ఓటు వేసే విధానంపై రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వారి సిబ్బందితో పాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో కూలంకషంగా చర్చించారు. సాధ్యమైనంత త్వరలో నిబంధనలు పాటిస్తూ సాఫ్ట్వేర్ను రూపొందించి డెమో ఇవ్వాల్సిందిగా వారిని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.
అలాగే ఇ-ఓటింగ్ విధానాన్ని పాటించడానికి సంబంధిత మున్సిపల్ శాఖను సంప్రదించి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిసిన అనంతరం ఇ-ఓటింగ్ విధానం అమలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోవు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విస్తృత స్థాయిలో కూడా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు పార్థసారధి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్, జాయింట్ సెక్రటరి జయసింహారెడ్డి, ఐటి శాఖతో పాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్కు పలువురు అధికారులు పాల్గొన్నారు.