Sunday, April 28, 2024

నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నకిలీ ఇన్సూరెన్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మూడు కార్లు, రూ.6లక్షల నగదు, ఎయిర్‌గన్, బ్యాంక్‌లో ఫ్రీజ్ డబ్బులు రూ.3,49,648, కెమెరా, ల్యాప్‌టాప్, 13 మొబైల్స్, సికార్డులు, పాస్‌బుక్కులు, చెక్కుబుక్కులు, ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్‌లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా, బోదన్‌కు చెందిన కోసరాజు రంగసాయి హర్షి ఇన్సూరెన్స్ కంపెనీలో కీ రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

దుప్పలపూడి అక్షయ్‌కుమార్ అలియాస్ టోనీ గ్రాఫిక్ డిజైనర్, మహ్మద్ యాసిన్ అహ్మద్, మన్యం ప్రశాంత్ అలియాస్ సాయి, అనుగులా ప్రకాష్ రెడ్డి ఇద్దరు ప్రధాన నిందితుడితో కలిసి పనిచేశాడు. ఓ ప్రవెటు బ్యాంక్‌కు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలో కీ రిలేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న రంగసాయి హర్ష వద్ద గతంలో పాలసీలు చేసిన వారి డాటా తన వద్ద ఉండేది, దానిని బిజినెస్ ఎగ్జిక్యూటీవ్స్‌కు ఇచ్చి మళ్లీ పాలసీలు చేయించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నిందితుడు రంగసాయి పలువురు ఎన్‌ఆర్‌ఐలు, ఇక్కడ ఉండే పాలసీదారులు, మృతిచెందిన వారి నామినీలు పాలసీ గడువు ముగిసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీనీ సంప్రదించడంలేదని తెలుసుకున్నాడు. దీనికితోడు ఆన్‌లైన్ పాలసీ సరెండర్ సిస్టం ఉండడంతో దానిని ఆధారంగా చేసుకుని పాలసీ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. దీనిని తన స్నేహితులు, బోదన్‌కు చెందిన వారిని సాయం తీసుకున్నాడు.

గ్రాఫిక్ డిజైన్ చేసే అక్షయ్ కుమార్ వద్ద నకిలీ పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌ను తయారు చేయించాడు. వాటి ద్వారా నకిలీ వ్యక్తుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తీసుకునేవాడు. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ఈమెయిల్ అప్‌డేట్ పేరుతో తన వద్ద ఉన్న నకిలీ మెయిల్‌ను పంపించేవాడు, దానిని కంపెనీ అంగీకరించగానే పాలసీ సరెండర్ రిక్విస్ట్ పంపించేవాడు. దానిని కంపెనీ అంగీకరించగానే నకిలీ బ్యాంక్ ఖాతా వివరాలు పంపించేవాడు,దీంతో పాలసీకి చెందిన డబ్బులు ఆ బ్యాంక్ ఖాతాకి ట్రాన్స్‌ఫర్ అయ్యేవి. ఇలా 19మంది పాలసీలను సరెండర్ చేసి రూ.4కోట్లు కొట్టేశారు. ఎండి యాసిన్ అహ్మద్‌ను పాలసీ హోల్డర్‌గా నకిలీ ఐడి కార్డులు సృష్టించేవారు. ఇతడు బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేవాడు. అదే కంపెనీలో పనిచేసిన మానేసిన అచ్యుత్, ప్రకాష్ రెడ్డి ప్రధాన నిందితుడికి సహకరించారు. ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో …
యాప్రాల్‌లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐ కిషోర్ కుమార్ తన పాలసీని అప్‌డేట్ చేసుకునేందుకు బ్రాంచ్‌కు వెళ్లాడు. ఆపరేషన్ టీముకు పాలసీ వివరాలు ఇవ్వగా మీ పాలసీ మ్యాచూర్టీ అయిందని డబ్బులు రూ.76,00,562 సౌత్ ఇండియన్ బ్యాంక్ ఖాతాకి ట్రాన్స్‌ఫర్ చేశామని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. తనకు డబ్బులు అందలేదని, పాలసీని సరెండర్ చేయలేదని చెప్పాడు. దీంతో బ్యాంక్ అధికారులు ఇచ్చిన వివరాలతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముఠాను అరెస్టు చేశారు. బాధితుడి డబ్బులతో నిందితుడు యాసిన్ మెహిదీపట్నంలోని జూవెల్లరీస్‌లో గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు కొనుగోలు చేసినట్లు సిసిటివిల ఫుటేజ్‌లో రికార్డయింది. ముందుగా యాసిన్ అదుపులోకి తీసుకుని విచారించగా మిగతా నిందితుల విషయం బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News