Sunday, April 28, 2024

తప్పుడు రిఫండ్ క్లెయిమ్ చేస్తే జైలుశిక్షతో పాటు పెనాల్టీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తప్పుడు రిఫండ్ క్లైయిమ్ చేస్తే జైలుశిక్షతో పాటు పన్నెండు శాతం వడ్డీ, రెండు వందల శాతం పన్నును పెనాల్టీగా విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిటాలి మధుస్మిత పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల లావాదేవీలు సులభంగా జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించడాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిటాలి మధుస్మిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదాయపు పన్ను శాఖ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫారాలను సరళంగా తయారుచేసిందన్నారు. ఆ రిటర్న్ ఫారాలను పన్ను చెల్లింపుదారులు సులభంగా ఆన్‌లైన్ సమర్పించవచ్చిన ఆమె తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులపై ఉంచిన నమ్మకంతో, రిటర్న్ సమర్పించే సమయంలో, వారు క్లెయిమ్ చేసిన తగ్గింపులు, మినహాయింపులకు సంబంధించిన రుజువులు, పత్రాలు కానీ ఆన్‌లైన్‌లో సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. పన్ను చెల్లింపుదారులకు రావాల్సిన రిఫండ్ ఏదైనా ఉంటే, దానిని వెంటనే స్వచ్ఛందంగా పన్నుదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ఆమె తెలిపారు.
రిఫండ్‌లకు సంబంధించిన సమాచారం పక్కాగా వెరిఫై….
ఆదాయపు పన్ను శాఖ తమవద్ద దాఖలు చేయబడిన రిటర్న్‌లో పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన మినహాయింపులు, తగ్గింపుల సమాచారాన్ని, వాటిని క్లెయిమ్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు కలిగిన అర్హతలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎక్కువమంది జీతాలు పొందుతున్న పన్ను చెల్లింపుదారులు తమకు అర్హత లేని అసంబద్ధమైన మినహాయింపులు, తగ్గింపులు వారి రిటర్న్‌లో కోరుతూ, వాటి ఆధారంగా చెల్లించిన పన్నులను తిరిగి రిఫండ్ తీసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆదాయపుపన్ను|శాఖ కనుగొందని ఆమె తెలిపారు. అసంబద్ధమైన రిఫండ్ క్లెయిమ్స్ చేసిన వారిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నట్టుగా తాము గుర్తించామని ఆమె పేర్కొన్నారు.
మధ్యవర్తుల మాటలను నమ్మవద్దు
ఈ ఉద్యోగుల్లో కొంతమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు పక్క రాష్ట్రాల్లోని కంపెనీలలో పనిచేస్తూ, వారి పాన్ నంబర్లు ఈ రాష్ట్రాల్లో కలిగి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీరిలో ఎక్కువమంది తమకు జీతం చెల్లించే యాజమాన్యం, ఆయా చెల్లింపు సమయాల్లో తగ్గించిన పన్నులో సుమారు డ్బ్బై అయిదు శాతం నుంచి తొంబై శాతం మేర రిఫండ్ క్లెయిమ్ చేశారని, ఈ విషయాలపై క్షేత్ర స్థాయిలో జరిపామని ఆమె పేర్కొన్నారు. తమ విచారణలో జీతాలు తీసుకుంటున్న కొంతమంది ఉద్యోగులు మధ్యవర్తుల మాటలకు ఆకర్షితులై, ఇటువంటి అసంబద్ధమైన క్లెయిమ్స్ చేయడం వలన వచ్చే పర్యవసానాలను గురించి ఆలోచన చేయకుండా, రిఫండ్ క్లెయిమ్స్ చేయడం అనే ప్రక్రియకు అలవాటు పడ్డట్టు గ్రహించామని ఆమె తెలిపారు.
మధ్యవర్తులపై చర్యలకు సిద్ధం
ఈమధ్య ఇలాంటి ఫిర్యాదులపై తాము విచారణ జరిపి కొంత కీలక సమాచారాన్ని కనిపెట్టామని ఆమె పేర్కొన్నారు. తమ విచారణలో ఎక్కువ సంఖ్యలో అర్హతలేని, అసంబద్ధమైన మినహాయింపులతో కూడిన రిటర్న్ వారి ఖాతాదారుల తరఫున దాఖలు చేసినట్లు, తద్వారా పెద్ద మొత్తంలో రిఫండ్స్ తీసుకున్నట్లు రుజువయ్యిందని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తులు కొంత మొత్తాన్ని కమీషన్ రూపంలో తీసుకున్నట్లు తేలిందన్నారు. అటువంటి తప్పుడు మినహాయింపులు కోరిన పన్ను చెల్లింపుదార్ల పేర్లను వారు తమవద్ద కొన్ని పత్రాల్లో నమోదు చేసినట్లు కనుగొన్నామన్నారు. వారిపై చర్యలకు ఐటీ శాఖ సిద్ధమయ్యిందని ఆమె తెలిపారు.
తప్పుడు రిఫండ్ చేసిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు, తగ్గింపులు వారి ఆదాయం నుంచి కోరినా పరిణామాలు చాలా కఠినంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. అలా చేసిన వారికి పన్నెండు శాతం వడ్డీ, రెండు వందల శాతం పన్నును పెనాల్టీ రూపంలో వసూలు చేయడంతో పాటు, ప్రాసిక్యూషన్ చేసి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని ఆమె హెచ్చరించారు. అయితే, ఈ ప్రక్రియలో తప్పుడు క్లెయిమ్స్ చేసి రిఫండ్ పొందిన పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 139 (8A) ప్రకారం మదింపు సంవత్సరాలు 2021, -22, 2022-,23 కు సవరించిన రిటర్స్ దాఖలు చేసి, 140 3 సెక్షన్ ప్రకారం పన్ను చెల్లించాలని, మదింపు సంవత్సరం 2023, -24 కొరకు ఇప్పటికే రిటర్న్ సమర్పించినవారు 13ఎం (3) సెక్షన్ ప్రకారం సవరించిన రిటర్స్ దాఖలు చేయవచ్చన్నారు.
మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నెంబర్‌లలో
ఐటీ 2023, -24, 2022,-23. 2021,-22 కోసం దాఖలు చేసిన రిటర్న్‌లోని అర్హతలేని తప్పుడు క్లెయిమ్స్‌ను సరిచూసుకుని, పునఃపరిశీలన తరువాత, సవరించిన రిటర్న్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పన్ను చెల్లింపుదారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. సందేహాలు, సాయం కోసం ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ఉన్న ఆయకార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు. లేదా www.incometaxindia.gov.in వెబ్‌సైట్ సంప్రదించవచ్చన్నారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ 18001030025/18004190025లను ఫోన్ చేయాలని ఆమె పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News