Sunday, April 28, 2024

రైతు, విద్యా కమిషన్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రైతు కమిషన్, విద్యా కమిషన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామ ని, త్వరలో నే ఈ రెండు కమిషన్‌ల ను ప్రకటించబోతున్నామని, మన విద్యావిధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని సిఎం రేవం త్ రెడ్డి అన్నారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నామని, కుల, మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమన్నారు.

పౌరసమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, రమ మేల్కొటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదె ఇన్నయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పౌర సమాజం ప్రతినిధులతో సిఎం రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌక్ ను తెరిచామన్నారు. ప్రజా భవన్‌ను ప్రజలకు అందు బాటులోకి తెచ్చామని, ప్రజా పాలన పాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించామని సిఎం పేర్కొన్నారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామని, పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని సిఎం తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామని, యుపిఎస్‌సి తరహాలో టిఎస్‌పిఎస్‌సి ద్వారా నియామకాలు చేపడతా మన్నారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని సిఎం తెలిపారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని, రైతుభరోసా ఎవరికి ఇవ్వాలన్న దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News