Sunday, April 28, 2024

కనీస మద్దతు ధర రైతు హక్కు!

- Advertisement -
- Advertisement -

మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో సఫలీకృతమైన ప్రభుత్వాలు ఎందుకు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం సాధ్యం అవడం లేదని సంవత్సరాలుగా వస్తున్న ప్రశ్న. కార్పొరేటీకరణ ప్రభావం అన్ని రంగాలపై ఉంది. అందులో వ్యవసాయ రంగానికి కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా వ్యవసాయదారుల హక్కులను, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేకుండా దేశంలో ఎటువంటి చట్టబద్ధమైన హక్కులను పొందే వర్గం ఏదైనా ఉందంటే అది రైతు వర్గం మాత్రమే. అనేక ఆందోళనలు, కమిషన్ల నివేదికల ద్వారా చెరుకు, పత్తి లాంటి ఇతర వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వాలు కొంత సఫలీకృతమైనప్పటికీ వరి, మొక్కజొన్న, గోధుమ లాంటి నిత్యావసర వస్తువులకు మద్దతు ధర ప్రకటించడంలో ప్రతిసారి విఫలమవుతూ వస్తున్నది. ధర హామీ లేని కారణంగా రైతులలో నిరాశ, నిస్పృహలు రోజురోజుకు పెరిగిపోయి కుటుంబాలకు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి మన దేశంలో ఉంది.

ఇతర దేశాలతో పోల్చుకుంటే వ్యవసాయ మార్కెట్లను అర్థం చేసుకునే పరిపక్వత మన ప్రభుత్వం, రైతులు ఎంఎస్‌పి (మినిమం సపోర్టు ప్రైస్) కనీస మద్దతు ధర అనేది వ్యవసాయ ఉత్పత్తులకు కల్పించాలనే ఆలోచన 1966 నుంచి భారత దేశంలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రతి సీజన్‌లో భారత ప్రభుత్వం ప్రకటించవలసి ఉంటుంది. ప్రతిసారి కొన్ని పంటలకు తప్ప మిగతా పంటలకు కనీస మద్దతు ధర ప్రకటన ఆలస్యమై రైతులకు ప్రతిసారి నిరాశే ఎదురవుతున్నది. భారత రత్న డాక్టర్ స్వామినాథన్ సారథ్యంలో 2004 నవంబర్‌లో రైతుల స్థితిగతులపై నియమించిన జాతీయ కమిషన్ తన ఆరు నివేదికలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా వారి మద్దతు ధర విషయంపై కూలంకషంగా సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం రైతు ఉత్పత్తులకు ప్రకటించే కనీస మద్దతు ధర మాత్రం ఆశించిన స్థాయిలో పెంచడం జరగలేదు. స్వామినాథన్ కమిషన్ సూచించినట్టుగా ఎ2 (పంట పండించడం కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు, పంట సాగు కోసం చేసిన ఖర్చు), ఎఫ్‌ఎల్ లేబర్ ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయం జరుగుతుందని, ఇది ఏ మాత్రం రైతుకు లాభసాటిగా లేదని కమిషన్ భావించి సి2 (స్థిరాస్తిపై చేసిన ఖర్చు)ను కూడా పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయం చేయాలని భావించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ సూత్రం ప్రకారం ధర నిర్ణయం చేస్తుందో ఎక్కడ వెల్లడించలేదు.

ప్రభుత్వం నిర్ణయించే ధరకు రైతులు, రైతు సంఘాలు అంచనా వేస్తున్న ధరకు ఏమాత్రం దగ్గరి సంబంధం కూడా లేదు. ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర సరిపోక అనేక ఆందోళనలు రైతులలో లేవనెత్తుతున్నాయి. పంట మార్పిడి విధానం ద్వారా రైతులు మద్దతు ధర పొందొచ్చు అనే ఆలోచనలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నప్పటికీ పంట మార్పిడి చేసినా మద్దతు ధర కష్టమే అని అనేక పంటల విషయంలో అది నిరూపితం అవుతూ వస్తుంది. నిత్యావసర వస్తువులైన పప్పుదినుసులు, జీలకర్ర, అల్లం పంట విత్తే సమయానికి ఉన్న ధరకి, పంట చేతికొచ్చే సమయానికి ఉన్న ధర సగానీకి సగం పడిపోతుంది. ఎటువంటి ధర హామీ లేకుండా రైతులు పంట మార్పిడి చేయడం కారణంగా మరింత నష్టపోయిన ఘటనలు అనేకం. దాని కారణంగా రైతులు పంట మార్పిడికి సుముకత చూపకపోవడం ముఖ్య కారణంగా మనం అర్థం చేసుకోవచ్చు. పంటకు ప్రభుత్వం విధించిన మద్దతు ధర కంటే వ్యాపారులే ఎక్కువ డబ్బులు ఇచ్చి పంటను కొనే స్థాయిలో ధర నిర్ణయం జరుగుతుంది. అంటే రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర, వారికి వచ్చే లాభాన్ని మనం అంచనా వేయవచ్చు. దేశంలో గోధుమలు,

వరి అధిక సాగు కారణంగా నిల్వలు పెరిగిపోతున్నాయని కేంద్ర ఆహార భద్రత సంస్థ సూచిస్తున్నప్పటికీ రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించే పాలన వ్యవస్థ కిందిస్థాయి వరకు లేకపోవడం దురదృష్టకరం. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత వ్యవసాయ చట్టాల్లో మార్పులు లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ నియంత్రణ ఎక్కువ అవ్వటం లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తరువాత కూడా రైతులకు ధరల హామీ కల్పించకపోవడం రైతుల అసహనానికి కారణం. చెరుకు పంటకి చట్టబద్ధత కల్పించడంలో 1966లో ప్రభుత్వం సఫలమైంది. కానీ మిగితా పంటల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి భారత ఆర్థిక వ్యవస్థకు, రైతులకు ఉండేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. రైతులతో ప్రభుత్వం అనేక సార్లు చర్చలు జరిపినా సమస్య ఒక కొలిక్కి రాకపోవడం, ఆందోళనల తీవ్రతరం చూస్తుంటే ఎన్నికల వేళ రైతుల ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశాలు లేకపోలేదు. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే కనీస మద్దతు ధర పెంచుతూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఖర్చుల దృష్ట్యా రైతులు జీవనం సాగించడం రోజురోజుకు కష్టతరమవుతుంది. కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వ భిక్ష కాదు, అది రైతుల హక్కు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News