న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున తాము తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించి తీరుతామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న చోట రైతు సంఘాలు ఆదివారం మీడియాతో మాట్లాడాయి. ఢిల్లీ ఔటర్ రింగ్రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నేత యోగేంద్రయాదవ్ తెలిపారు. తమ పరేడ్ శాంతియుతంగా సాగుతుందని, రిపబ్లిక్డే ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని ఆయన అన్నారు. ట్రాక్టర్లపై రైతులు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న లేదా మద్దతు తెలుపుతున్నవారిపై జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఎ) కేసులు పెడుతోందని మరో నేత దర్శన్పాల్సింగ్ విమర్శించారు. ఎన్ఐఎ చర్యను రైతు సంఘాలన్నీ ఖండిస్తున్నాయని ఆయన తెలిపారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అవుట్ఫిట్ అనే నిషేధిత సంస్థకు సంబంధించిన కేసులో రైతు సంఘం నేత ఒకరికి ఎన్ఐఎ సమన్లు జారీ చేయడాన్ని ఆయన గుర్తు చేశారు.
Farmers Tractor Parade on Jan 26