26 మార్చి నుంచి 17 డిసెంబర్ వరకు
207 ట్రిప్పులతో 1,256 పాల ట్యాంకర్లతో సరఫరా
మనతెలంగాణ/హైదరాబాద్: ‘దూద్ దూరం’ స్పెషల్ ట్రెయిన్ ద్వారా 05 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. కోవిడ్ 19 లాక్డౌన్ సమయంలో నిత్యావసరమైన పాలను దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక చొరవ తీసుకొని 26 మార్చి 2020 నుంచి దూద్ దురంతో స్పెషల్ ద్వారా రోజు విడిచి రోజు ప్రత్యేకంగా పాల సరఫరాను ప్రారంభించింది. ఎపిలోని రేణిగుంట నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైలు ద్వారా ఈ పాలను సరఫరా చేస్తున్నారు. డిమాండ్ నేపథ్యంలో 15 జూలై నుంచి ప్రతి రోజు ఈ రైలు ద్వారా పాలను సరఫరా చేస్తున్నారు. 26 మార్చి 2020 నుంచి గురువారం వరకు 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. ‘దూద్ దురం’తో స్పెషల్ రైలుకు 6 పాల ట్యాంకర్లను అమర్చారు.
ఒక్కో ట్యాంకర్లో 40 వేల లీటర్ల సామర్థంతో ఉన్న పాలను ఢిల్లీకి సరఫరా చేశారు. దూద్ దురంతో ట్రెయిన్ ఇప్పటివరకు 207 ట్రిప్పులతో 1,256 పాల ట్యాంకర్లతో 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసింది. 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయడంలో నిరంతరం కృషి చేసిన గుంతకల్ డివిజన్, జోనల్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, అధికారులను దక్షిణమధ్య రైల్వే జిఎం గజానన్ మాల్య అభినందించారు. ఇప్పటివరకు 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయడంపై జిఎం సంతోషం వ్యక్తం చేశారు.