నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని 34వ డివిజన్లోని ఎస్బిఎస్ ఫంక్షన్హాల్ లో సంతోష్కుమార్ ఏర్పాటు చేసిన నిత్యఅన్నదాన కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనికోసం కరీంనగర్కు వచ్చి లాక్డౌన్తో ఉపాధి కరువైన వలస కూలీలకు ఎంపి సంతోష్ కుమార్ ఉచితంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో రెండుకోట్ల 81 లక్షల మందికి 11 వందల కోట్ల ఖర్చుతో ఆకలి తీరుస్తున్న సిఎం కెసిఆర్ దేశానికే ఆదర్శనీయమన్నారు.
పొరుగురాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు సిఎం కెసిఆర్ ఇస్తున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు కరీంనగర్ గడ్డపై పుట్టిన ఎంపి సంతోష్ కుమార్ గత కొన్నిరోజులుగా వలసకూలీలకు నిత్యం అన్నదానం చేస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. పొట్టకూటి కోసం కరీంనగర్కు వచ్చి పనిలేక ఆకలికి అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఎంపి సంతోష్ కుమార్ చేస్తున్న ఆన్నదానం ఎంతో గొప్పదన్నారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా వలసకార్మికుల కడుపు నింపుతున్నారని చెప్పారు. లాక్డౌన్ ముగిసే వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తామన్నారు.
అన్నదాన కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొనాలని ఆయన పిలపునిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ ఎంపి సంతోష్కుమార్ నిర్వహిస్తున్న అన్నదానం ఎంతోమంది పేదల కడుపునింపుతుందని చెప్పారు. కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలను ప్రారంభించిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న వలసకూలీలను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వలసకూలీలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన, నిర్వహిస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శనీయమని ఆయన చెప్పారు.